కుంబ్లేతో బోర్డుకి ఎక్కడ చెడింది?: ఎందుకు ఈ అనూహ్య నిర్ణయం
హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేకి బీసీసీఐ షాక్ ఇచ్చింది. హెడ్ కోచ్గా కుంబ్లే కొనసాగుతాడని, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆ పదవిలో అతడే ఉంటాడని చాలా కాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ గురువారం తెరదించింది. బీసీసీఐతో కుంబ్లే ఒప్పందం ఇంగ్లాండ్లో జూన్ ఒకటి నుంచి జరిగే చాంపియన్స్ ట్రోఫీతో ముగుస్తుంది.
దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు కోచ్ పదవికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ గురువారం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. నిజానికి కుంబ్లే కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా స్వదేశంలో 13 టెస్టుల్లో 10 గెలిచింది. ఒకటి మాత్రమే ఓడింది. రెండు డ్రా అయ్యాయి.
దీంతో విజయవంతమైన కోచ్ కుంబ్లేను కొనసాగించకుండా బీసీసీఐ మళ్లీ ఎంపిక ప్రక్రియ చేపట్టాలనుకోవడం అనూహ్య నిర్ణయమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. క్రికెటర్ల జీతాలతో పాటు చాలా అంశాల్లో అనిల్ కుంబ్లే వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న బోర్డు అధికారులు కావాలనే ఇలా చేశారని వార్తలు వస్తున్నాయి.
కుంబ్లే కాంట్రాక్టును పొడిగించకుండా, కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించడం వెనుక బలమైన కారణమే ఉందని బీసీసీఐ అధికారులు అంటున్నాయి. బీసీసీఐ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం, క్రికెటర్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్కు కాంట్రాక్టు మొత్తాలను పెంచాలని ఇటీవలే కుంబ్లే పట్టుబట్టిన సంగతి తెలిసిందే.

సంతృప్తి చెందని కుంబ్లే
కుంబ్లే కోరిక మేరకు బీసీసీఐ కూడా దీనికి అంగీకరించింది. తద్వారా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు కింద ‘ఎ', ‘బి', ‘సి' పొందిన ప్రతి ఒక్క క్రికెటర్కు పారితోషికం డబుల్ అయింది. అయితే, ఈ డిమాండ్ నెరవేడంతో కుంబ్లే సంతృప్తి చెందలేదు. కెప్టెన్ కోహ్లీకి అదనంగా మరో 25 శాతం ఫీజును సీఓఏకి నివేదికలో ప్రతిపాదించాడు.

కెప్టెన్ కోహ్లీ ఫీజు రెట్టింపు చేయాల్సిందే
కెప్టెన్కు అదనపు భారం ఉంటుంది కాబట్టి, ఆ మాత్రం మొత్తం ఇవ్వడంలో తప్పులేదని వాదించాడు. తన ఫీజును కూడా రెట్టింపు చేయాలని కోరాడు. జాతీయ సెలక్షన్ కమిటీలో కోచ్కి కూడా సభ్యత్వం ఉండాల్సిందేనని బీసీసీఐకి సూచించాడు. అయితే, లోధా కమిటీ చేసిన సూచనలకు ఈ డిమాండ్ పూర్తిగా వ్యతిరేకం.

లోథా కమిటీ చేసిన సిఫార్సులకు వ్యతిరేకం
లోథా కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం సెలక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండాలి. కుంబ్లేను సభ్యుడిగా తీసుకోవాలంటే, ఆ సంఖ్యను నాలుగుకు పెంచాలి. లోధా సిఫార్సులను అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఆ ప్రక్రియ సజావుగా సాగేందుకు పాలనా కమిటీ(సీఓఏ)ని కూడా నియమించింది.

కుంబ్లే డిమాండ్ అర్ధరహితం
ఇలాంటి పరిస్థితుల్లో కుంబ్లే డిమాండ్ అర్ధరహితమని బీసీసీఐ అభిప్రాయపడుతోంది. అంతేకాదు మొదటి నుంచి జట్టు కోచ్, కెప్టెన్ కూడా సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతారు. వారి అభిప్రాయలను వెల్లడిస్తారు. అయితే వారికి ఓటు హక్కు మాత్రం ఉండదు. కుంబ్లే ఓటు హక్కు కోసం పట్టుబట్టడంతో బోర్డు అసహనానికి గురైంది.

బోర్డుకు ఆర్ధిక భారం
ఇప్పటికే ఆటగాళ్ల కాంట్రాక్టు సొమ్మును రెట్టింపు చేసి, అదనపు ఆర్ధిక భారాన్ని బోర్డు నెత్తినపెట్టుకుంది. తన జీతభత్యాలను కూడా పెంచాలని కుంబ్లే డిమాండ్ చేయడం బోర్డు అధికారులకు నచ్చడం లేదు. సెలక్షన్ కమిటీలో సభ్యత్వం ఇవ్వాలన్న అతని మరో డిమాండ్ను కూడా వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణాలతోనే కుంబ్లేను తప్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తన పదవికే ఎసరు తెచ్చుకున్న కుంబ్లే
ఇలా కుంబ్లే చివరికి తన పదవికే ఎసరు తెచ్చుకున్నాడు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసే లోపు టీమిండియాకు కొత్త కోచ్ నియామకం జరగని తరుణంలో కుంబ్లేనే ఆ బాధ్యతల్లో కొనసాగుతాడని బీసీసీఐ అధికారికంగా తెలిపింది. టీమిండియాకు కొత్త కోచ్ నియామకాన్ని బీసీసీఐ పాలనా కమిటీ(సీఓఏ)తో పాటు ముగ్గురు సభ్యుల క్రికెట్ అడ్వైజరీ కమిటీ పర్యవేక్షించనుంది.

దరఖాస్తు లేకుండానే నేరుగా ఇంటర్వ్యూకు అర్హత
కాగా, కోచ్ పదవికి కుంబ్లే కూడా రేసులో ఉండే అవకాశం లేకపోలేదు. ప్రస్తుత హెడ్ కోచ్ హోదాలో అతను దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఇంటర్వ్యూకు అర్హత సంపాదిస్తారు. మిగతా వారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన తర్వాత సీఓఏ కొంత మంది పేర్లను ఖరారు చేస్తుంది. ఈ విధంగా ఎంపికైన వారికే ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. ఆ తర్వాత సీఓఏ కోచ్ పేరును ప్రతిపాదిస్తే, బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications