రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ దాదాపు ఏడాది నుంచి క్రికెట్ కు దూరమయ్యాడు. సర్జరీ చేయించుకున్న అనంతరం నడవడానికే కష్టపడిన పంత్.. పరుగులు పెట్టేలా కోలుకున్నాడు. అయితే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో తిరిగి జట్టులో చోటు సంపాదించేలా పంత్ కసిగా ఫిట్ నెస్ సాధిస్తున్నాడు. కానీ మెగాటోర్నీకి అతడిని పరిగణనలోకి తీసుకోవాలంటే ఐపీఎల్ లో పంత్ సత్తాచాటాల్సి ఉంది.
అందుకే ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఫిట్ నెస్ తో పాటు మునపటిలా బ్యాటింగ్ ఫామ్ ను అందుకోవడానికి పంత్ ప్రయత్నాలు షురూ చేశాడు. జిమ్ లో కసిగా బరువులు ఎత్తుతున్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దేనిని వదలకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాని, ఐపీఎల్ కు తిరిగొస్తానని ఆ వీడియోకు ఇండైరెక్ట్ గా క్యాప్షన్ రాసుకొచ్చాడు.

ఐపీఎల్ లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున పంత్ ఆడుతున్న విషయం తెలిసిందే. గాయంతో గత సీజన్ కు దూరమైనా పంత్ ను రిటైన్ కూడా చేసుకుంది. పంత్ గైర్హాజరీలో దిల్లీ జట్టును డేవిడ్ వార్నర్ నడిపించాడు. అయితే 2023 సీజన్ లో దిల్లీ పేలవ ప్రదర్శన చేసింది. పాయింట్స్ టేబుల్ లో ఆఖరి నుంచి రెండో స్థానానికి పడిపోయింది.
మరోవైపు దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఐపీఎల్ కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్ నెస్ కాపాడుకుంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైనా ధోనీ గత సీజన్ లో మెరిసిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలిపాడు. సిక్సర్ల మోత మోగించడమే గాక, తన 'చాణక్య బుర్ర'తో అయిదో సారి చెన్నైని ఛాంపియన్ గా నిలిపాడు. వచ్చే సీజన్ లోనూ ధోనీ తన మ్యాజిక్ ను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.