
ఢిల్లీ: నిర్భయ దోషులను ఉరి తీయాలని పేర్కొంటూ మంగళవారం ఢిల్లీ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్లకు ఢిల్లీ కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. జనవరి 22న దోషులను ఉరితీయాలని అదనపు సెషన్స్ న్యాయమూర్తి సతీశ్ కుమార్ డెత్ పెనాల్టీ జారీ చేశారు. కోర్టు తీర్పును ప్రజలు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హర్షిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
'నైతిక బాధ్యతల సమాహారమే న్యాయం. నిర్భయ కేసులో తీర్పు ఇచ్చిన ఢిల్లీ కోర్టుకు వందనం. ఇప్పుడు ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుంది' అని యువరాజ్ ట్వీట్లో రాసుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ప్రయాణిస్తున్న బస్సులో 2012 డిసెంబర్ 16న నిర్భయపై పవన్ గుప్తా, ముకేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, ఒక మైనర్ బాలుడితో సహా ఆరుగురు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఏడేళ్ల తర్వాత దోషులకు శిక్ష పడింది.
తాజాగా న్యూజిలాండ్ దేశవాళీ టీ20 క్రికెట్లో యువ బ్యాట్స్మెన్ లియో కార్టర్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. కార్టర్ను కూడా యువీ ట్విట్టర్ ద్వారా అభినందించాడు. '6 సిక్సర్ల క్లబ్లోకి లియో కార్టర్కు స్వాగతం. అదో అద్భుతమైన హిట్టింగ్. ఈ గౌరవానికి గుర్తుగా నీ జెర్సీపై సంతకం చేసి బౌలర్ డేవ్సిచ్కు బహూకరించు' అని ట్వీట్ చేశారు.
2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే. యువరాజ్ గత సంవత్సరం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1,900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్ల్లో 8,701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్లు ఆడిన యువీ.. 1,177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.