
హైదరాబాద్: అండర్-19 వరల్డ్కప్ యువ క్రికెటర్లకు ఓ గొప్ప అవకాశమని, తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. జనవరి 13 నుంచి న్యూజిలాండ్లో జరగబోయే అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా యువ ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ కొన్ని సూచనలు చేశాడు.
భారత అండర్-19 జట్టుకు దేశవాళీ క్రికెట్లో యువ సంచలనం పృథ్వీ షా నేతృత్వం వహిస్తుండగా.. మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. కోహ్లీ సారథ్యంలోని జట్టు 2008లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లీ యువ క్రికెటర్లను ఉద్దేశించి ఐసీసీ మీడియాతో మాట్లాడాడు.
'అండర్-19 వరల్డ్కప్ నాజీవితంలో ఓ గొప్ప మైలురాయి. ఇది మంచి వేదికలు దొరికేందుకు ఆపై కెరీర్ను మలుచుకునేందుకు సాయం చేస్తుంది. అందుకే ఈ టోర్నీకి నా హృదయంలో, మనసులో ప్రత్యేక స్థానం ఉంది. మీకు లభించిన అవకాశాన్ని అర్థం చేసుకోవడం గౌరవించడం చాలా ముఖ్యం' అని యువ క్రికెటర్లకు సూచించాడు.
అంతేకాదు తన అండర్-19 టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్ను గుర్తుచేసుకున్న కోహ్లీ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో ఆడిన సంగతులు గుర్తుచేసుకున్నాడు. ఆ టోర్నీలో కివీస్ను భారత్ సెమీస్లో ఓడించింది. 'కేన్తో ఆడటం గుర్తుంది. అతనెప్పుడూ జట్టు తరఫున గట్టిగా నిలబడతాడు. ఇతరులతో పోలిస్తే అతడి బ్యాటింగ్ సామర్థ్యం చాలా భిన్నం' అని అన్నాడు.
స్టీవ్స్మిత్ గురించి స్పందిస్తూ.. తన జట్టు వారితో తలపడలేదని, కానీ అతను తర్వాతి రోజుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని తెలిపాడు. 'ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్తో ఆడలేదు కాబట్టి అతడి బ్యాటింగ్ను చూడలేదు. అప్పుడు మాతో పోటీపడ్డ చాలా మంది ఇప్పుడు ఈ టోర్నీ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు ఎదిగారు' అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఇక, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ 'ఇది కుర్రాళ్లకు జీవితంలో ఓ మెట్టులాంటిది. నాలుగేళ్లకోసారి జరిగే సీనియర్ క్రికెటర్ల వరల్డ్కప్లో ఎంతమందికి అవకాశం వస్తుందో చెప్పలేం. రెండేళ్లకోసారి జరిగే ఈ ప్రపంచకప్ను కుర్రాళ్లు సద్వినియోగం చేసుకోవాలి' అని అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.