గత కొన్నిరోజులుగా రోహిత్ శర్మకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యను కెప్టెన్గా ముంబై ఇండియన్స్ నియమించడంతో అసలు రచ్చ మొదలైంది. రోహిత్కు మద్దతుగా నిలుస్తూ ముంబై ఫ్రాంచైజీని, హార్దిక్ పాండ్యను హిట్మ్యాన్ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. స్టేడియంలో, బయటా హార్దిక్ను హేళన చేస్తున్నారు.
అంతేగాక ముంబై ఇండియన్స్ జట్టు రెండు వర్గాలు చీలిపోయించదనే కథనాలు కూడా ప్రచురితం అయ్యాయి. రోహిత్కు మద్దతుగా బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ నిలుస్తున్నారని వార్తలొచ్చాయి. మరోవైపు ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన అనంతరం ముంబై ఇండియన్స్ను రోహిత్ వీడనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఐపీఎల్ మెగా వేలంలో హిట్ మ్యాన్ బరిలోకి దిగుతున్నాడంటూ జాతీయ మీడియాలో పేర్కొన్నారు.

అయితే తాజాగా రోహిత్కు సంబంధించిన మరో వార్త వైరల్గా మారింది. ముంబై ఫ్రాంచైజీపై అసంతృప్తిగా ఉన్న రోహిత్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని పేర్కొంటున్నారు. హిట్ మ్యాన్ కోసం ఎస్ఆర్హెచ్ సహయజమాని కావ్య మారన్ బ్లాంక్ చెక్ కూడా సిద్ధం చేసిందని తెలుపుతున్నారు. అంతేగాక కెప్టెన్సీ పగ్గాలు కూడా అందిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడిస్తున్నారు. గతంలో తెలుగు టీమ్ డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ శర్మ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. టైటిల్ గెలిచిన జట్టులో రోహిత్ భాగస్వామి కూడా.
తెలుగు టీమ్పై ఉన్న ఈ సెంటిమెంట్తో రోహిత్ సన్రైజర్స్ హైదరాబాద్కు వెళ్లే అవకాశాలూ ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీ నుంచి అనుమతి లేకుండా ఏ ఆటగాడు ఇతర ఫ్రాంచైజీలతో చర్చించకూడదు. ఈ నేపథ్యంలో ఈ వార్త నిజమా కాదా అనే విషయంపై స్పష్టత లేదు. కాగా, 2008 నుంచి 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ 45 మ్యాచ్లు ఆడాడు. 30 సగటుతో 890 పరుగులు సాధించాడు. అంతేగాక ముంబై ఇండియన్స్పైనే రోహిత్ హ్యాట్రిక్ సాధించడం గమనార్హం.