ఇంగ్లాండ్తో జరిగిన సెమీపైనల్లో
సెమీస్కి ముందు పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 47 బంతుల్లోనే 51 పరుగులు చేసిన మిథాలీ, ఐర్లాండ్పై 56 బంతుల్లో 51 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్ల్లోనూ భారత్ అలవోక విజయాన్ని సాధించింది. అయితే, ఇంగ్లాండ్తో జరిగిన సెమీపైనల్లో మిథాలీని తప్పించడం వెనుక జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం ఉంది.
మిథాలీరాజ్ను తప్పించడానికి కారణం!
సెమీఫైనల్ మ్యాచ్కు ముందు మహిళల జట్టు కోచ్ రమేశ్ పొవార్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, సెలక్టర్ సుధాషా, జట్టు మేనేజర్ తృప్తి భట్టాచార్య తుది జట్టు ఎంపిక విషయమై సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే తుదిజట్టులో మిథాలీరాజ్ను తప్పించారట.
అసలు విషయం నివేదికలో వెల్లడి
ఈ మేరకు తాజా ఓ నివేదిక బయటకు వచ్చింది. "కోచ్, కెప్టెన్, సెలక్టర్ కలిసి సెమీస్కు కేటాయించిన పిచ్ గురించి పూర్తిస్థాయి చర్చ జరిపారు. ఈ క్రమంలో ఆసీస్పై విజయం సాధించిన జట్టుతోనే సెమీఫైనల్ మ్యాచ్కు బరిలోకి దిగాలని కోచ్ పేర్కొన్నారు. కెప్టెన్ హర్మన్ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కూడా కోచ్ నిర్ణయాన్ని ఓకే చెప్పారు" అని నివేదికలో ఉంది.
అదనపు బౌలర్ ఉంటే జట్టుకు మరింత మద్దతుగా
"దీనికితోడు మ్యాచ్కు అదనపు బౌలర్ ఉంటే జట్టుకు మరింత మద్దతుగా ఉంటుందని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అభిప్రాయనికి జాతీయ సెలక్టర్ సుధాషా కూడా మద్దతు తెలిపారు. అయితే తుదిజట్టు మార్పుల విషయంలో ఎలాంటి సూచనలు చేయలేదు" అని ఈ నివేదిక ద్వారా తెలిసింది. దీని కారణంగానే సెమీఫైనల్ మ్యాచ్కు మిథాలీని రిజర్వ్ బెంచ్కు పరిమితం చేశారు.
మిథాలీని తప్పించడంపై కెప్టెన్ హార్మన్ప్రీత్ కౌర్ ఇలా
ఇక, మిథాలీని తుది జట్టు నుంచి తప్పించడాన్ని కెప్టెన్ హార్మన్ప్రీత్ కౌర్ సమర్ధించుకుంది. మ్యాచ్ అనంతరం హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ "కొన్ని సార్లు మా వ్యూహం ఫలిస్తోంది. మరికొన్ని సార్లు విఫలమవుతోంది. దీనికి చింతించాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో మహిళల జట్లు ఆట పట్ల గర్వపడుతున్నాను. యువ జట్టుగా ఇది మాకో గుణపాఠం. కొన్ని సార్లు పిచ్ వికెట్ను బట్టి ఆటను మార్చుకోవాల్సి ఉంటుంది" అని పేర్కొంది.
ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు
"ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. మేం విధించిన టార్గెట్ను చేధించడం కూడా అంత సులువు కాదు. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. మేం మ్యాచ్ను 18 ఓవర్లు వరకు తీసుకొచ్చాం. యువజట్టుగా మేం మానసికంగా ధృడపడాల్సిన అవసరం ఉంది. ఒత్తిడిలో ఎలా ఆడాలో అనే దానిపై దృష్టిపెట్టుంటే.. ఇలాంటి మ్యాచ్లను సులువుగా మావైపు తిప్పుకునే వాళ్లం" అని హార్మన్ప్రీత్ తెలిపింది.