2008 అండర్-19 వరల్డ్ కప్ సెమీస్లో కోహ్లీదే పైచేయి..
2008 ఫిబ్రవరి 27వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్లో అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్ ఏర్పాటైంది. సెమీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. న్యూజిలాండ్కు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించాడు. భారత్కు విరాట్ కోహ్లీ సారథ్యం చేపట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. కోరె అండర్సన్ ఆ మ్యాచ్లో టాప్ స్కోరర్. 67 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో అండర్సన్ 70 పరుగులు చేశాడు. శ్రీవాస్తవ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేప్టెన్ కేన్ విలియమ్సన్ చాలా నిదానంగా ఆడాడు ఆ మ్యాచ్లో. 80 బంతులను ఎదుర్కొన్న విలియమ్సన్ 37 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఉన్నవి కేవలం మూడు ఫోర్లే. విరాట్ కోహ్లీ బౌలింగ్లోనే అవుట్ కావడం ఇంకో విశేషం.
లక్ష్య ఛేదనలో మెరుపులా..
అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత అండర్-19 జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. 41.3 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులను చేసింది. డక్వర్త్ లూయిస్ విధానం ప్రకారం.. జూనియర్ కోహ్లీసేన ఆ మ్యాచ్లో విజయాన్ని సాధించింది. ఫైనల్కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్లో రాణించాడు. 53 బంతుల్లో అయిదు ఫోర్లతో 43 పరుగులు చేశాడు. జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అప్పట్లో భారత్ తరఫున అండర్-19 టీమ్లో ఆడిన రవీంద్ర జడేజా, న్యూజీలాండ్ తరఫున ఆడిన టిమ్ సౌథీ.. ఇద్దరూ సీనియర్ జట్టులోనూ చోటు సంపాదించుకోవడం విశేషం.
సక్సెస్ కూడా రిపీట్ అవుతుందా?
టీమ్ కేప్టెన్లు రిపీట్ అయ్యారు. బాగానే ఉంది. మరి విజయం కూడా రిపీట్ అవుతుందా? లేదా? అనేది తెలియాలంటే మంగళవారం వరకూ వేచి చూడక తప్పదు. ఇప్పుడున్న బలాబలాల ప్రకారం.. టీమిండియాదే పైచేయి అవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఓపెనర్లు రోహిత్శర్మ, కేఎల్ రాహుల్, మొదలుకుని లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ల వరకూ అందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలర్లు కూడా అంతే! ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. అత్యధిక వికెట్ల తీసుకున్న బౌలర్లుగా రాణిస్తున్నారు. నిజానికి- ఈ రెండు జట్లు లీగ్ దశలోనే తలపడాల్సి ఉన్నప్పటికీ.. వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే.
కివీస్ పోటీ ఇవ్వగలుగుతుందా?
ప్రపంచకప్ టోర్నమెంట్ను అద్భుతంగా ఆరంభించిన జట్లలో న్యూజిలాండ్ ఒకటి. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా రాణించింది. చివరి మూడు మ్యాచుల్లో ఓటమి పాలై, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. మెరుగైన రన్రేట్ ఆధారంగా బ్లాక్ క్యాప్స్ సెమీస్లోకి అడుగు పెట్టారు. అలాగని ఆ జట్టును తేలిగ్గా తీసుకోవడానికి ఎంత మాత్రం కూడా ఛాన్స్ లేదు. తనదైన రోజున ఓపెనర్ గప్టిల్ ఎలా చెలరేగిపోతాడో మనం ఇదివరకే చూశాం. ప్రపంచకప్ టోర్నమెంట్లో నమోదైన ఒకే ఒక్క డబుల్ సెంచరీని సాధించింది గప్టిలే. కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, నీషమ్, కొలిన్ మున్రో, లాథమ్.. వీరంతా అద్భతమైన బ్యాట్ చేయగలవారే. కాకపోతే- వారి బ్యాటింగ్లో స్థిరత్వం లోపించింది. వరుసగా మూడు పరాజయాల బారిన పడ్డ న్యూజిలాండ్.. నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించగలిగితే టీమిండియాకు ఇబ్బందులే.