అత్యధిక డబ్బు ఉన్నది ఆ జట్లే
ఐపీఎల్లో ఆటగాళ్లను కొనడానికి ఒక్కో జట్టు 90 కోట్ల రూపాయలను వెచ్చించడానికి బీసీసీఐ అవకాశం కల్పించింది. అయితే 2022 ఐపీఎల్ మెగా వేలానికి పంజాబ్ కింగ్స్ జట్టు తమ దగ్గర అన్ని టీంల కంటే ఎక్కువగా భారీ మొత్తంలో డబ్బులు ఉంచుకుంది. ఆ టీం దగ్గర ఏకంగా 72 కోట్ల రూపాయలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇద్దరిని మాత్రమే రిటెన్షన్ చేసుకున్న ఆ జట్టు వారికి 18 కోట్లు చెల్లించనుంది. ఇక పంజాబ్ తర్వాత ఎక్కువ డబ్బులు సన్రైజర్స్ హైదరాబాద్ దగ్గరే ఉన్నాయి. హైదరాబాద్ దగ్గర 68 కోట్ల రూపాయల మిగులు నిధులు ఉన్నాయి. గత ఆటగాళ్లను ముగ్గురిని రిటైన్ చేసుకున్న హైదరాబాద్ వారికి 22 కోట్ల రూపాయలను చెల్లించనుంది.
రాజస్థాన్, బెంగళూరు దగ్గర ఉన్న డబ్బులు
ఆ తర్వాత మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్లకు ఆ జట్టు రూ. 28 కోట్లు చెల్లించనుండగా వేలానికి ఇంకా రూ.62 కోట్లు మిగిలి ఉన్నాయి. ఇక ఆ తర్వాత నాలుగో స్థానంలో కొత్త జట్టు లక్నో ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం రిటెన్షన్ ఆటగాళ్ల కోసం లక్నో జట్టు 30 కోట్ల రూపాయలు చెల్లించనుంది. దీంతో ఆ జట్టు దగ్గర ఇంకా 60 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి. ఇక ఐదో స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉంది. బెంగళూరు ఖాతాలో ప్రస్తుతం 57 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి.
|
ముంబై, చెన్నై వద్ద ఎన్ని ఉన్నాయంటే..
అత్యధిక డబ్బులు ఉన్న జట్ల జాబితాలో కొత్త జట్టు అహ్మదాబాద్ ఆరో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 53 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి. ఇక ఐపీఎల్లో అత్యధిక సార్లు ట్రోఫీలు గెలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాయి. రిటెన్షన్ డబ్బులు పోను ఇంకా ఆ జట్ల దగ్గర వేలానికి 48 కోట్ల రూపాయలు మిగిలి ఉన్నాయి.
తక్కువ డబ్బులు ఉన్న జట్టు
ఈ సారి మెగా వేలానికి అందరి కంటే తక్కువ డబ్బులు ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ దగ్గర రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్లు చెల్లించే డబ్బులు పోను 47.5 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి.