న్యూఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి జెనీవా కోర్టులో ఊరట లభించింది. 'www.msdhoni.com' వెబ్సైట్ డొమైన్ పేరు వివాదంపై జెనీవాలోని వైపో ఆర్బిట్రేషన్ అండ్ మీడియా సెంటర్లో దాఖలైన ఫిర్యాదులో ధోనీ, రిథి స్పోర్ట్స్ మేనేజ్మెంట్కు ఊరట కలిగిస్తూ అనుకూలంగా తీర్పు వచ్చింది.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అంతేకాదు 'www.msdhoni.com' డొమైన్ను ధోనీ, రిథి స్పోర్ట్స్ మేనేజ్మెంట్కు బదలాయిస్తూ తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే 'www.msdhoni.com' అనే డొమైన్ అక్టోబర్ 31, 2015 నుంచి వైల్డ్ వెస్ట్ డొమైన్స్ వద్ద ఫిబ్రవరి 2014 నుంచి అమెరికాకు చెందిన డేవిడ్ హాన్లే అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు.
దీంతో దీనిపై ఆగస్టు 19, 2016న రిథి స్టోర్ట్స్ వైపోలో డొమైన్ పేరిట ఫిర్యాదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోని లాంటి వ్యక్తి పేరిట వెబ్సైట్ నిర్వహించడం ట్రేడ్మార్క్, వ్యక్తిగత నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని తన ఫిర్యాదులో రిథి స్టోర్ట్స్ పేర్కొంది.

ధోని పేరిట వెబ్సైట్ ఉండటం వల్ల అందులోని సమాచారాన్ని ధోని నిర్వహిస్తున్నట్లు అభిమానులతో పాటు ప్రజలు భ్రమపడే అవకాశం ఉందని తన ఫిర్యాదులో రిథి స్టోర్ట్స్ ఆందోళనను వ్యక్తం చేసింది. దీనిపై విచారించిన కోర్టు కావాలనే ధోని పేరిట అతడు డొమైన్ను రిజిస్టర్ చేసుకున్నాడని గుర్తించింది.
అంతేకాదు రిథి స్పోర్ట్స్ ఫిర్యాదు మేరకు సరైన రీతిలో స్పందించకపోడవంతో పాటు 1500 అమెరికా డాలర్లను ఇస్తే 'www.msdhoni.com' డొమైన్ను ఇచ్చేస్తానని లేఖ రాయడంతో అతడి దురుద్దేశాన్ని వెల్లడిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది.
దీంతో 'www.msdhoni.com' డొమైన్ను రిథి స్టోర్ట్స్కే కేటాయిస్తూ తీర్పు వెలువరించింది. డొమైన్ను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమైన భద్రతా చర్యగా ఆ సంస్థ ప్రతినిధులు ఓ పత్రికా ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఇది తీవ్ర దుర్వినియోగం అవకాశం ఉందని, బ్రాండ్ విలువను కాపాడుకునేందుకు ఇది చాలా కీలకమని అందులో పేర్కొన్నారు.