
హైదరాబాద్: శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు టీ20 సిరిస్ నుంచి తనకు లభించిన విశ్రాంతిని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చక్కగానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలను దృష్టిలో పెట్టుకుని విరాట్ కోహ్లీ, ధోనిలతో పాటు పలువురు సీనియర్ క్రికెటర్లకు శ్రీలంక సిరిస్కు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పజెబుతూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 58 రోజుల సుదీర్ఘ సఫారీ పర్యటనను ముగించుకుని ఆటగాళ్లు అంతా తమ ఇళ్లకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంటికి చేరుకున్న కోహ్లీ ఓ ఫోటోని సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
'ఇంట్లో కాఫీ తాగుతున్నాను. చాలా బాగుంది' అని కోహ్లీ ట్వీట్ చేశాడు. కోహ్లీ పోస్టు చేసిన ఫొటో నెటిజన్లకు బాగా నచ్చినట్టుంది. దీనికి నెటిజన్లు 'కోహ్లీ ఇంతకీ నువ్వు ఢిల్లీ ఇంట్లో ఉన్నావా?.. ముంబయి ఇంట్లో ఉన్నావా?, ఈ కాఫీ నీ కోసం అనుష్క చేసి ఇచ్చిందా?' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 1-2తో చేజార్చుకున్నప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఆరు వన్డేల సిరిస్ను 5-1తో, మూడు టీ20ల సిరిస్ను 2-1తో కైవసం చేసుకున్నారు.
మూడో టీ20 ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ కలిసి లక్ష ర్యాండ్లను గిఫ్ట్ ఆఫ్ ది గివర్స్ ఫౌండేషన్కు న్యూల్యాండ్స్ స్టేడియంలో 8,500 డాలర్ల సాయం అందించారు. ప్రజలకు మంచినీరు అందించేందుకు సాయం చేసిన క్రికెటర్లను ఫౌండేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ సూలిమాన్ అభినందించారు. బోరు బావులు తవ్వించేందుకు, మంచినీటి సీసాలు అందించేందుకు ఈ డబ్బును ఖర్చు చేస్తామని ఆయన అన్నారు.
సఫారీ గడ్డపై సిరిస్లో భాగంగా ఇరు జట్లు కేప్టౌన్లో క్రికెట్ ఆడిన సందర్భంలో నీటి కొరతతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లు స్థానిక ప్రజల కష్టాలను అర్థం చేసుకున్నారు. అప్పుడే కోహ్లీతో మాట్లాడి ఆటగాళ్లు సంతకాలు చేసిన టీషర్టులను వేలం వేశామని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు.