భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం ప్రస్తుతం ఓ కీలక మలుపులో ఉన్నట్లు తెలుస్తోంది. 2024లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ అప్రతిహత విజయాలతో దూసుకుపోతుండగా.. టెస్ట్ క్రికెట్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. వరుసగా ఎదురవుతున్న పరాజయాలు గంభీర్ కోచింగ్ స్టైల్పై.. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్లో ఆయన వ్యూహాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ కీలక అడుగులు వేస్తోందా? అంటే ఔననే తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో టెస్ట్ కోచ్గా గంభీర్ను తొలగించి.. ఆ బాధ్యతలను మరొకరికి అప్పగించే 'స్ప్లిట్ కోచింగ్' విధానాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వైట్ బాల్ క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం
గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అద్భుతాలు సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని ఐసీసీ టైటిల్ కరువును తీర్చింది. అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 జట్టు పటిష్టంగా తయారైంది. ఇటీవల జరిగిన సిరీస్లలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టు తిరుగులేని ప్రదర్శన కనబరుస్తోంది. ఈ విజయాలన్నీ గంభీర్ కోచింగ్ సామర్థ్యంపై నమ్మకాన్ని పెంచినప్పటికీ, రెడ్ బాల్ క్రికెట్ వచ్చేసరికి ఆ నమ్మకం సడలుతోంది.

టెస్టుల్లో నిరాశ తప్పలేదు..
టెస్ట్ క్రికెట్లో టీమిండియా ఎదుర్కొంటున్న వైఫల్యాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో భారత్ 0-3తో ఘోరంగా ఓడిపోయి, క్లీన్ స్వీప్కు గురైంది. ఇది భారత క్రికెట్ చరిత్రలోనే ఒక చేదు జ్ఞాపకం. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా అదే ఫలితం పునరావృతమైంది. 2-0తో సఫారీల చేతిలో వైట్వాష్ అవ్వడం గంభీర్ కోచింగ్పై ఒత్తిడిని పెంచింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి జట్లపై విజయాలు సాధించినప్పటికీ, బలమైన జట్లపై భారత్ నిలబడలేకపోవడం గంభీర్ భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది.
లక్ష్మణ్ నిరాకరణ - తదుపరి ప్రత్యామ్నాయం ఎవరు?
టెస్ట్ జట్టును గాడిలో పెట్టేందుకు బీసీసీఐ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ను బీసీసీఐ ఉన్నతాధికారులు సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే లక్ష్మణ్ సీనియర్ జట్టు కోచ్ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆయన బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' అభివృద్ధి పనుల్లోనే కొనసాగాలని భావిస్తున్నారు. దీంతో టెస్ట్ ఫార్మాట్ కోసం సమర్థుడైన మరో కోచ్ను వెతకడం ఇప్పుడు బోర్డుకు సవాలుగా మారింది.
టీ20 వరల్డ్ కప్ 2026 కీలకం
ప్రస్తుతానికి గంభీర్ భవిష్యత్తు 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్పై ఆధారపడి ఉంది. భారత్ ఈ టోర్నీలో కనీసం ఫైనల్ చేరినా గంభీర్ మూడు ఫార్మాట్లలో కోచ్గా కొనసాగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ కూడా నిరాశ ఎదురైతే, బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రిపోర్టుల ప్రకారం, వైట్ బాల్ క్రికెట్కు గంభీర్ను పరిమితం చేసి, టెస్టులకు కొత్త కోచ్ను నియమించే దిశగా చర్చలు జరుగుతున్నాయి. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న సిరీస్ గంభీర్ కోచింగ్కు మరో అగ్నిపరీక్షగా మారనుంది.