
లండన్: ఇంగ్లీష్ గడ్డపై జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు భారీ ఎత్తున వ్యూయర్షిప్ వస్తోంది. గత మూడేళ్లలో భారత క్రికెట్ టీమ్ ఆడిన విదేశీ ద్వైపాక్షిక సిరీస్లలో అత్యధిక వ్యూయర్షిప్ ఈ సిరీస్కే వచ్చినట్లు సోనీ స్పోర్ట్స్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 4న ప్రారంభమైన ఈ సిరీస్లో ప్రస్తుతం మూడో టెస్ట్ జరుగుతోంది. మరో రెండు టెస్టులు జరగాల్సి ఉంది. 2018లో భారత్, ఇంగ్లండ్ మధ్యే జరిగిన సిరీస్ కంటే ఇప్పుడు సగటు వ్యూయర్షిప్ 30 శాతం పెరిగినట్లు సోనీ స్పోర్ట్స్ చెప్పుకొచ్చింది.
భారీ ఎత్తున వ్యూయర్షిప్ రావడానికి అసలు కారణం లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టే కారణం. అందులోనూ చివరి రోజు ఆటకు సగటు రేటింగ్స్ 70 శాతం వరకూ పెరిగాయి. భారత్ గెలుస్తుందన్న అంచనాతో ఆ రోజు భారీగా మ్యాచ్ను చూశారు. మ్యాచ్ డ్రా అవుతుందనుకున్నా.. అద్భుత బౌలింగ్ కారణంగా భారత్ విజయాన్ని అందుకుంది. చివరి రోజే సుమారు 80 లక్షల ఇంప్రెషన్స్ వచ్చాయని సోనీ స్పోర్ట్స్ తెలిపింది.
భరత జట్టు విదేశాల్లో ఆడిన టెస్ట్ మ్యాచ్ ఒక రోజు వచ్చిన అత్యధిక ఇంప్రెషన్స్ (80 లక్షలు) ఇవే. ఆ రోజు చివరి సెషన్లో ఇంగ్లండ్ 120 పరుగులకే ఆలౌటైన సందర్భంలో కోటి 7 లక్షల ఇంప్రెషన్స్ వచ్చాయి అని సోనీ స్పోర్ట్స్ చెప్పింది. లార్డ్స్ టెస్ట్లో కోహ్లీసేన గెలిచిన తర్వాత సోనీ చానెల్కు మరిన్ని బ్రాండ్లు క్యూ కట్టడం విశేషం. ఇప్పటికే ఈ సిరీస్కు 12 బ్రాండ్లు స్పాన్సర్లుగా ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీసుకు కూడా భారీ వ్యూయర్షిప్ వచ్చింది. రసవత్తర పోరులో భారత్ అద్భుతంగా ఆడింది.
మూడో టెస్టులో ఎట్టకేలకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 132.2 ఓవర్లు ఆడిన రూట్ సేన ఏకంగా 432 పరుగులు చేసింది. 354 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 423/8తో మూడో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ మరీ ఎక్కువ పరుగులేమీ చేయలేదు. క్రెయిగ్ ఓవర్టన్ (32; 42 బంతుల్లో 6×4) మొహ్మద్ షమీ వేసిన 130వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. 132వ ఓవర్లో అతడి బౌలింగ్లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ప్లయిట్ ఓలి రాబిన్సన్ (0; 15 బంతుల్లో) పరుగుల ఖాతా తెరవలేదు. జస్ప్రీత్ బుమ్రా వేసిన 132.2వ బంతికి బౌల్డ్ అయ్యాడు. జేమ్స్ అండర్సన్ (0) అజేయంగా నిలిచాడు.
టీమిండియా విదేశాల్లో 131 ఓవర్లకు పైగా ఒక ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ చేయడం 2015 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు సిడ్నీ టెస్టులో ఏకంగా 152.3 ఓవర్లు ఫీల్డింగ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. 15 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 50 బంతుల్లో 14 పరుగులు, లోకేష్ రాహుల్ 43 బంతుల్లో 7 రన్స్ చేశాడు. భారత్ ఇంకా 333 పరుగులు వెనకపడి ఉంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 78 పరుగులకే కుప్పకూలింది.