హైదరాబాద్: భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డుని సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో మిథాలీ ఈ ఘనత సాధించింది.
ఈ మ్యాచ్కి ముందు ప్రపంచ రికార్డు సాధించేందుకు మిథాలీకి 34 పరుగులు అవసరమయ్యాయి. అయితే బుధవారం బ్రిస్టల్ వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మిథాలీ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించింది.

దీంతో ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ 28వ ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. అంతకముందు మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ రికార్డు 5992 పరుగులతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఎడ్వర్డ్స్ పేరిట ఉంది.
ఈ రికార్డుని 5,993 పరుగులతో మిథాలీ రాజ్ అధిగమించింది. అంతేకాదు అతి తక్కువ మ్యాచ్ల్లో (183 వన్డేలు) ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్గా మిథాలీ రికార్డు సృష్టించింది.
6,000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్:
అత్యధిక పరుగులతో పాటు వన్డే క్రికెట్లో 6,000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్గా కూడా మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో 41 పరుగులు చేయడం ద్వారా మహిళల వన్డే క్రికెట్లో 6,000 పరుగులు చేసిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించింది.
16 ఏళ్ల వయసులో 1999లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసింది. ఇప్పటికీ అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు మిథాలీ పేరిట ఉండటం విశేషం. మహిళల క్రికెట్లో సచిన్ టెండూల్కర్గా మిథాలీకి పేరుంది. 19 ఏళ్ల వయసులో టాంటన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా అరుదైన గుర్తింపు సాధించింది.

టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్గా పాకిస్థాన్కు చెందిన కిరన్ బలూచ్ పేరిట ఉంది. 2004లో వెస్టిండిస్తో జరిగిన టెస్టు మ్యాచ్లో కిరన్ 242 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే తన 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో మిథాలీ రాజ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవలే వన్డేల్లో వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్గా మిథాలీ రికార్డు సృష్టించింది.
వన్డే అరంగేట్రం చేసిన తర్వాత వరుసగా 15 ఏళ్లు పాటు మిథాలీ యావరేజి 40కి పైగా ఉండటం విశేషం. సచిన్ కూడా సరిగ్గా ఇన్నేళ్ల పాటు 40కి పైగా యావరేజితో పరుగులు చేయడం విశేషం. 2008-12 మధ్యలో ఐదేళ్లు మినహాయిస్తే 2004 నుంచి భారత మహిళల జట్టుకి మిథాలీ కెప్టెన్గా కొనసాగుతోంది.
105 వన్డేలకు మిథాలీ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించింది. త్వరలోనే కెప్టెన్గా ఎడ్వర్డ్స్ పేరిట ఉన్న 117 వన్డేల రికార్డును కూడా మిథాలీ అధిగమించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మిథాలీ కెప్టెన్గా ఉన్న సమయంలో భారత్ 61 శాతం మ్యాచ్లు గెలవగా, ప్లేయర్గా కేవలం 53 శాతమే గెలవడం విశేషం.