హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జేపీ డుమిని ఒకే ఓవర్లో 37 పరుగులు సాధించి సరికొత్త రికార్డుని సృష్టించాడు. కేప్ టౌన్లోని న్యూలాండ్స్ స్టేడియంలో సఫారీ లిస్ట్-ఎ క్రికెట్లో భాగంగా బుధవారం కేప్ కోబ్రాస్, నైట్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో డుమిని ఈ అరుదైన రికార్డుని తన పేరిట లిఖించాడు.
మొమెంటమ్ వన్డే కప్లో కేప్ కోబ్రాస్ కెప్టెన్ డుమిని ఒకే ఓవర్లో 6, 6, 6, 6, 2, 5 (నోబాల్), 6 పరుగులు నమోదు చేశాడు. స్పిన్నర్ ఎడ్డీ లీ వేసిన ఇన్నింగ్స్ 36వ ఓవర్లో తొలి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచాడు. దీంతో మరో సిక్సర్లు బాది దక్షిణాఫ్రికాకు చెందిన గిబ్స్ రికార్డును సమం చేస్తాడేమో అని మ్యాచ్ చూస్తున్న అభిమానులు ఆశపడ్డారు.
అయితే ఐదో బంతికి రెండు పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత నోబాల్కు బౌండరీ రాగా చివరి బంతిని సిక్సర్గా మలిచాడు. దీంతో ఒక ఓవర్లో డుమిని 37 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్లో డుమిని 37 బంతుల్లో 70 పరుగులు చేయడంతో కోబ్రాస్ జట్టు విజయం సాధించింది.
240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోబ్రాస్ ఈ ఓవర్కు ముందు 208 పరుగులతో ఉండగా డుమిని (37 బంతుల్లో 70 నాటౌట్) రాణించడంతో ఆరు బంతుల్లోనే విజయం సాధించింది. ఇక లిస్ట్ 'ఎ' క్రికెట్లో ఒకే ఓవర్లో చిగుంబుర (జింబాబ్వే) అత్యధికంగా 39 పరుగులు చేయగా డుమిని రెండో స్థానంలో ఉన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.