మహీ కెప్టెన్సీలో ఆడడమే:
160 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో భారత్ మ్యాచుపై ఆశలు వదిలేసుకుంది. ఈ సమయంలో దీపక్ చహర్తో కలిసి కృనాల్ పాండ్యా పోరాడాడు. దీంతో మ్యాచుపై ఆశలు చిగురించాయి. 193 వద్ద కృనాల్ పెవిలియన్ చేరడంతో మరోసారి సందేహాలు మొదలయ్యాయి. అప్పటికి సాధించాల్సిన రన్రేట్ తక్కువగానే ఉన్నా.. పరుగులు చేయడానికి బ్యాట్స్మెనే లేరు. క్రీజులో ఉన్నది బౌలర్లే కాబట్టి.. వారిపై ఎంతో ఒత్తిడి ఉంటుంది. కానీ చహర్ మాత్రం ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా తనపని తాను చేసుకుపోయాడు. దీనికి కారణం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆధ్వర్యంలో ఐపీఎల్ ఆడడమే. గత మూడు సంవత్సరాలుగా మహీ కెప్టెన్సీలో అతడి చెన్నై తరఫున ఆడుతున్నాడు. ధోనీ కూల్, కామ్నెస్ చహర్లో కనిపించాయి. ఇది భారత్ గెలవడానికి ఓ కారణం.
అందరూ అనుభవరాహితులే:
దిగ్గజాలు ఒక్కొక్కరుగా ఆటకు వీడ్కోలు పలకడంతో శ్రీలంక జట్టు ఇటీవలి కాలంలో బలహీనంగా మారిన విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్టు బోర్డు, ఆటగాళ్ల మధ్య గతకొంత కాలంగా వివాదం జరుగుతోంది. సెంట్రల్ కాంట్రాక్టు కారణంగా, బయో బబుల్ నిబంధనలను అతిక్రమించడం ద్వారా స్టార్ ఆటగాళ్లు ఈ సిరీసుకు దూరమయ్యారు. దీంతో లంక జట్టులో ప్రస్తుతం ఉన్నవాళ్లు అందరూ అనుభవరాహితులే. ఇప్పడు ఉన్నవారు సగానికి పైగా 10 వన్డే మ్యాచుల కంటే ఏక్కువగా ఆడలేదు. కొందరు అయితే 3-5 మ్యాచులు ఆడారు. ఇక షనక కూడా కెప్టెన్సీ కొత్తదే. దీంతో సరైన సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోయారు. ఇది మనకు కలిసొచ్చింది.
రన్ రేట్ తగ్గకుండా టీ20 మ్యాచులా ఆడారు:
ఛేదన ఆరంభంలోనే భారత్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పృథ్వీ షా, ఇషాన్ కిషన్ త్వరగానే నిష్క్రమించారు. కెప్టెన్ శిఖర్ ధావన్ (29), మనీష్ పాండే (37)లు ధాటిగా ఆడారు. ఆపై సూర్యకుమార్ యాదవ్ (53) కూడా తన మార్క్ షాట్లు ఆడాడు. కృనాల్ పాండ్యా (35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. క్రీజులోకి వచ్చిన ప్రతి భారత బ్యాట్స్మన్ ధాటిగానే ఆడాడు. దీంతో రన్ రేట్ ఎక్కడా పడిపోలేదు. దీంతోనే దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్ క్రీజులోకి వచ్చేసరికి సాధించాల్సిన రన్ రేట్ అందుబాటులోనే ఉంది. ప్రతిఒక్కరు వన్డేలా కాకుండా.. టీ20 మ్యాచులా ఆడారు కాబట్టే భారత్ విజయాన్ని అందుకుంది. ఐపీఎల్ అనుభవం ఇక్కడ బాగానే పనికొచ్చిందని చెప్పొచ్చు.
సూర్య సూపర్ ఫిఫ్టీ:
దీపక్ చహర్ ఇన్నింగ్స్కు ఏ మాత్రం తీసిపోదు సూర్యకుమార్ (53; 44 బంతుల్లో 6×4) సూపర్ ఫిఫ్టీ. చహర్ కడవరకు క్రీజులో ఉండి టీమిండియాకు విజయాన్ని అందిస్తే.. అందుకు బాటలు వేసింది మాత్రం సూర్య అనే చెప్పాలి. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్య.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా గేర్లు మార్చాడు. ఈ క్రమంలోనే ఫోర్ కొట్టిన సూర్య వన్డేల్లో తొలి ఫిఫ్టీని పూర్తి చేశాడు. అయితే అదే ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీగా వెనుదిరగాడు. ఆపై బాధ్యతను చహర్ తీసుకున్నాడు. భువీ అండతో 64 బంతుల్లో తొలి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. కండరాలు పట్టేయడంతో చికిత్స తీసుకున్న దీపక్.. నొప్పిని భరిస్తూనే ఓ అద్భుత ఫోర్తో జట్టుకు విజయాన్ని అందించాడు.