పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు మరో తలనొప్పి ఎదురైంది. జట్టును చక్కదిద్దడంలో బీజీగా ఉన్న పీసీబీకి స్టార్ ప్లేయర్పై వేటు వేసే పరిస్థితి తలెత్తింది. అఫ్రిదిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీమ్ మేనేజ్మెంట్, కోచింగ్ స్టాఫ్ పీసీబీకి ఫిర్యాదు చేస్తూ డిమాండ్ చేసింది. అసలేం జరిగిందంటే..
టీ20 వరల్డ్ కప్కు ముందు ఇంగ్లండ్ పర్యటనకు పాకిస్థాన్ వెళ్లింది. ఈ సిరీస్లో స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది, బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసఫ్పై తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకనొకరు దూషించుకున్నారు. ప్రాక్టీస్లో గొడవ మొదలైంది. నో బాల్స్ ఎక్కువగా వేస్తున్నావని అఫ్రిదితో యూసఫ్ పేర్కొనడంతో అసలు లొల్లి మొదలైంది.

బ్యాటింగ్ కోచ్గా ఆ పని మాత్రమే చూసుకోవాలని, అనవసర విషయాల్లో వేలు పెట్టవద్దని యూసఫ్కు షాహిన్ అఫ్రిది దురుసగా సమాధానమిచ్చాడని తెలిసింది. అయితే ఆ తర్వాత యూసఫ్కు అఫ్రిది క్షమాపణలు చెప్పాడని సమాచారం. ఇంగ్లండ్ పర్యటన అనంతరం పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికాకు వెళ్లింది. భారత్, అమెరికా చేతిలో చిత్తుగా ఓడి పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తిరిగి ఇంటికి చేరిన పాకిస్థాన్ టీమ్ ఇక ఫిర్యాదులు చేసుకోవడం మొదలుపెట్టింది. టీమ్ మేనేజ్మెంట్, కోచింగ్ స్టాఫ్ కలిసి షాహిన్ అఫ్రిదిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ప్రత్యేకంగా ఫిర్యాదు చేశాయి. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశాయి. మరోవైపు దిద్దుబాటు చర్యల్లో బిజీబిజీగా ఉన్న పాక్ బోర్డుకు తాజా ఫిర్యాదు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది.
టీ20 వరల్డ్ కప్ ఆతిథ్య దేశాలైన అమెరికా, వెస్టిండీస్ పిచ్లను అంచనా వేయకుండా జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లపై పీసీబీ ఇటీవల వేటు వేసిన విషయం తెలిసిందే. సెలక్షన్ కమిటీ నుంచి వాహబ్ రియాజ్, అబ్దుల్ రజాక్ను తప్పింది. ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సాధించాలనే కసితో జట్టును బలోపేతం చేస్తోంది.
ఈ పరిస్థితుల్లో షాహీన్ అఫ్రిదిపై యాక్షన్ తీసుకోవడం జట్టుపై ప్రభావం చూపిస్తుందని పాక్ బోర్డు అభిప్రాయపడుతుంది. మరోవైపు కోచ్, మేనేజ్మెంట్ మాత్రం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నాయి. కొన్ని మ్యాచ్లకు అఫ్రిదిపై వేటు వేస్తారా లేదో తెలియాలంటే ఆగస్టు వరకు ఎదురుచూడాలి. స్వదేశంలో బంగ్లాదేశ్తో పాక్ ఆగస్టు 21 నుంచి రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.