ముంబై: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా కాన్పూర్లో జరిగిన తొలి వన్డే చివరి ఓవర్లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బౌలింగ్ చేయడాన్ని తాను ఆస్వాదించానని, బాగా ఎంజాయ్ చేశానని దక్షిణాఫ్రికా పేసర్ రబడ అన్నాడు. ఆ ఓవర్లో విజయానికి 11 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోనీ 4 బంతులాడి అవుటయ్యాడు.
రబడా వేసిన ఓవర్లో ధోనీ కేవలం మూడు పరుగులే రాబట్టాడు. అనంతరం పెవిలియన్కు చేరాడు. దీనిపై మీడియా... రబడను ఆకాశానికెత్తింది. ఆఖరి ఓవర్లో ధోనీ పైన రబడ విజయం సాధించాడని ప్రశంసించింది.

దీనిపై రబడ మాట్లాడుతూ... భారత్తో జరిగిన మొత్తం వన్డే సిరీస్లో తాను ధోనీకి వేసిన ఓవర్నే ఎక్కువగా ఆస్వాదించానని చెప్పాడు. నిజంగా అది చాలా ఒత్తిడితో కూడుకున్న ఓవర్ అని చెప్పాడు. తొలుత చివరి ఓవర్ను నేను వేయకూడదని అనుకున్నానని, కెప్టెన్ డివిల్లియర్స్ తన పైన నమ్మకం ఉంచాడన్నాడు.
ఆ ఓవర్లో ధోనీని పూర్తిగా కట్టడి చేశానని చెప్పాడు. ధోనీకి పరుగులు ఇవ్వకుండా ఆపడమే కాకుండా వికెట్ కూడా దక్కించుకున్నానని, తనకు పూర్తిస్థాయిలో నమ్మకం కలిగించిన ఓవర్ అది అన్నాడు.
ప్రత్యర్థికి ధోనీ సాయం!
ఐదో వన్డేలో డికాక్, డివిల్లీయర్స్కు చక్కని సహకారం అందించి సఫారీ జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించిన డుప్లెసిస్ తన పట్టుదలతో అందరినీ ఆకట్టుకున్నాడు. సెంచరీకి ముందే కాలి కండరాలు పట్టేయడంతో అతను ఇబ్బంది పడ్డాడు.
అయినా నొప్పిని దిగమింగి బ్యాటింగ్ చేశాడు. ఆక్షర్ వేసిన 43వ ఓవర్లో... మొదటి బంతిని సిక్సర్ కొట్టగానే కాలి నొప్పితో విలవిల్లాడాడు. నాలుగో బంతిని స్టాండ్స్కు పంపి క్రీజులోనే పడిపోయాడు. ఈ సమయంలో ఫిజియో వచ్చి వైద్యం చేశాడు. ఐదో బంతికి సిక్స్ కొట్టిన అనంతరం మరోసారి నొప్పితో కిందపడ్డాడు. ఫిజియో వచ్చేలోపు అతనికి ధోనీ సాయం చేశాడు.