
హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని సొంత చేసుకున్న భారత యువ జట్టు సోమవారం ముంబైకి చేరుకుంది. వీరికి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు యువ క్రికెటర్లకు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ముంబై అంతర్జాతీయ విమానం కిక్కిరిసిపోయింది. పృథ్వీషా నేతృత్వంలోని యువ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో గతంలో ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా భారత్ అండర్-19 వరల్డ్ కప్ని నాలుగోసారి కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ముంబైకి చేరుకున్న అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు కెప్టెన్ పృథ్వీ షా మీడియాతో మాట్లాడారు.
వరల్డ్ కప్ విజయం కోసం యువ ఆటగాళ్లు ఎంతో త్యాగం చేశారని ద్రవిడ్ అన్నాడు. సమిష్టి కృషి వల్లే వరల్డ్ కప్ సాధించామని అన్నాడు. అందరూ బాగా రాణించడంతో మా కష్టానికి ఫలితం దక్కిందని, యువ క్రికెటర్లకు మంచి భవిష్యత్ ఉందని ద్రవిడ్ కొనియాడాడు.
అండర్-19 ఆటగాళ్లను తయారు చేయడం కోసం వేసిన ప్లానింగ్ ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. ఫైనల్లో యువకులు ఆడిన తీరు, ఒత్తిడిని జయించిన తీరు ఎంతగానో ఆకట్టుకుందని తెలిపాడు. ఒత్తిడిలో ఫైనల్లో ఆడడం అదో రకమైన అనుభవమని చెప్పుకొచ్చాడు. కుర్రాళ్లు సాధించిన ఘనత పట్ల గర్వంగా ఉందని ద్రవిడ్ అన్నాడు.