చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన సూపర్ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్కు గాయమైంది. డైవ్ చేసినప్పుడు అతని పక్కటెముకలకు దెబ్బ తగిలింది. ఆ నొప్పితో ఫీల్డింగ్ చేయడం మరీ ఇబ్బందిగా ఉంటుందని అనుకున్న అతను.. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఆర్సీబీని ముందుండి నడిపించే సరైన ప్లేయర్ మరొకరు లేరు.
దీంతో ఆ టీం కెప్టెన్సీ మళ్లీ వెళ్లి కోహ్లీ చేతుల్లోనే పడింది. ఈ క్రమంలోనే పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్సీ చేశాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లను ఆలౌట్ చేసి, జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. ఇప్పుడు తాజాగా బలమైన రాజస్థాన్పై కూడా అద్భుతమైన కెప్టెన్సీ కనబరిచాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో.. రాజస్థాన్ బిగ్ హిట్టర్లు భారీ షాట్లు ఆడలేకుండా చక్కగా ప్లాన్లు వేశాడు.

బ్యాటుతో తాము అనుకున్న స్కోరు సాధించలేకపోయినా.. తన బౌలర్లను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఫీల్డింగ్లో కూడా చురుగ్గా కదులుతూ అందరిలో స్ఫూర్తి నింపాడు. అతని ఆలోచనలకు అనుగుణంగా బౌలింగ్ చేసిన హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్ ఇద్దరూ ఎంత చక్కగా రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేశారో అందరూ చూశారు. ఇలా వరుసగా రెండు మ్యాచులు కోహ్లీ కెప్టెన్సీలో గెలవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషానికి హద్దు లేకుండా పోయింది.
దానికితోడు రాజస్థాన్తో మ్యాచ్లో టాస్ సమయంలో కోహ్లీ వాళ్లకు ఒక ఇంట్రస్టింగ్ విషయం కూడా చెప్పాడు. తను కొన్ని మ్యాచులకు కెప్టెన్సీ చేయాల్సి వస్తుందన్నాడు. టీం మేనేజ్మెంట్ తనకు ఈ విషయం చెప్పిందని, తనకు కూడా ఇదేం కొత్త కాదు కాబట్టి సరే అన్నానని వెల్లడించాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ మరో ఆలోచన లేకుండా బెంగళూరుకు కోహ్లీని పర్మినెంట్ కెప్టెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఐపీఎల్లో కోహ్లీ కెప్టెన్సీ వహించిన రెండు మ్యాచుల్లో ఆర్సీబీ వరుస విజయాలు నమోదు చేసింది. అందుకే ఫ్యాన్స్ అందరూ కెప్టెన్ కోహ్లీ తిరిగొస్తే చూడాలని ఉందని కామెంట్లు చేస్తున్నారు. స్టేడియంలో కోహ్లీ ఎగ్రెషన్ కూడా అద్భుతంగా ఉందని, టీం కెప్టెన్సీ మళ్లీ అతనికే ఇచ్చేయాలని అంటున్నారు. అయితే కోహ్లీ మాత్రం డుప్లెసిస్ అద్భుతంగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడని, తను కూడా డుప్లెసిస్ చేస్తున్న పనే చేస్తున్నానని అనడం గమనార్హం.