ఐపీఎల్లో వరుసగా రెండు మ్యాచుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ రెండు మ్యాచుల్లో కూడా ఫాఫ్ డుప్లెసిస్ ఈ టీంకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించలేదు. పక్కటెముకలకు గాయం తగలడంతో అతను ఫీల్డింగ్కు రాలేదు. దీంతో విరాట్ కోహ్లీకి జట్టు పగ్గాలు అందించారు. అతని కెప్టెన్సీలో ఆర్సీబీ వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించింది.
ఆదివారం నాడు రాజస్థాన్ రాయల్స్ను కూడా ఆర్సీబీ చిత్తు చేసింది. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయిపోయారు. కోహ్లీని మళ్లీ ఆర్సీబీ కెప్టెన్ చేయాలని, ఆ పోస్టును పర్మినెంట్గా అతనికే ఇవ్వాలని సోషల్ మీడియాలో హోరెత్తించారు. అయితే ఈ మ్యాచ్లో అనుకున్న టైం కల్లా మ్యాచ్ను ముగించడంలో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై బీసీసీఐ భారీ జరిమానా వేసింది.

ఇప్పటి వరకు ఐపీఎల్ 2023లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా చాలా మంది కెప్టెన్లకు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా ఈ ఫైన్ కట్టిన వాడే. అయితే రాజస్థాన్తో మ్యాచ్లో కూడా ఆర్సీబీ స్లోగా ఓవర్లు వేసింది. దీంతో ఈ మ్యాచ్లో కెప్టెన్ కోహ్లీకి ఏకంగా రూ.24 లక్షలు ఫైన్ వేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అంతేకాదు, ఇలా కేవలం కెప్టెన్ మీదనే కాకుండా ఆర్సీబీ జట్టుపై కూడా జరిమానా వేస్తున్నట్లు తెలిపింది.
ఈ మ్యాచ్లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా ఆర్సీబీ టీం మొత్తానికి రూ.6 లక్షలు లేదంటే వారి ప్యాకేజీలో 25 శాతాన్ని ఫైన్గా వేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో ఇలా ఈ ఏడాది రూ.24 లక్షలు ఫైన్ వేయించుకున్న తొలి కెప్టెన్ విరాట్ కోహ్లీనే కావడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ వంటి చాలా మంది కెప్టెన్లకు స్లో ఓవర్ రేటింగ్ ఫైన్ పడినా.. అది కేవలం రూ.12 లక్షలే. అయితే ఇది ఆర్సీబీ రెండో తప్పిదం కావడంతో డబుల్ ఫైన్ పడింది.