రాజస్థాన్ రాయల్స్తో తలపడేందుకు ఆర్సీబీ రెడీ అయింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీనే ఈ టీంకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. చెన్నైతో మ్యాచులో గాయపడిన ఫాఫ్ డుప్లెసిస్ ఈ మ్యాచులో కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడని కోహ్లీ చెప్పాడు. ఏప్రిల్ 23న ఆర్సీబీ ఆడిన మ్యాచుల్లో వారి రికార్డు గొప్పగా లేకపోవడం ఫ్యాన్స్కు ఆందోళన కలిగిస్తోంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేకుండానే బరిలో దిగుతున్నామని, ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరిని తీసుకుంటామో పరిస్థితిని బట్టి నిర్ణయించుకుంటామని సంజూ చెప్పాడు. ఇక్కడ బౌలింగ్ చేయడానికి యుజ్వేంద్ర చాహల్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

తను టాస్ గెలిచినా కూడా ముందుగా బ్యాటింగే ఎంచుకునే వాడినని కోహ్లీ అన్నాడు. పిచ్ చాలా పొడిగా ఉందని, మ్యాచ్ జరిగే కొద్దీ ఇది మరింత పొడిబారుతుందని అనుకుంటున్నట్లు అతను చెప్పాడు. అలాగే పిచ్ ఆ తర్వాత మరింత స్లో అయ్యే అవకాశం ఉందని, అందుకే ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నట్లు తెలిపాడు. తమ జట్టులో కేవలం ఒకే మార్పుతో బరిలో దిగుతున్నట్లు చెప్పాడు.
సౌతాఫ్రికా పేసర్ వేన్ పార్నెల్ ఈ మ్యాచ్లో ఆడటం లేదని, అతని స్థానంలో డేవిడ్ విల్లే ఆడుతున్నాడని కోహ్లీ వెల్లడించాడు. అదొక్కటే తమ జట్టులో మార్పు అని చెప్పాడు. చెన్నైతో మ్యాచ్ తరవాత టీం మేనేజ్మెంట్ తనను కలిసిందని, కొన్ని మ్యాచులు కెప్టెన్సీ చేయాలని కోరిందని కోహ్లీ చెప్పాడు. తను కొత్తగా ఏం చేయడం లేదని, ఫాఫ్ అద్భుతంగా చేస్తున్న పనినే తను కూడా కొనసాగిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మ్యాక్స్వెల్, సూయష్ ప్రభుదేశాయి, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, వానిందు హసరంగ, డేవిడ్ విల్లే, మహమ్మద్ సిరాజ్, విజయ్కుమార్ వైశాఖ్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్