చెన్నై చేతిలో డిసప్పాయింటింగ్ ఓటమి తర్వాత ఆర్సీబీ ఆడుతున్న మ్యాచ్ పంజాబ్తోనే. పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ రికార్డు అంత గొప్పగా ఏం లేదు. ఈ రెండు జట్లు తలపడిన చివరి ఐదు మ్యాచుల్లో నాలుగింట ఆర్సీబీ ఓటమిపాలైంది. దీంతో పంజాబ్ ఈ మ్యాచ్లో పైచేయి సాధించే అవకాశం ఉంది. అయితే భుజం గాయంతో ఉన్న శిఖర్ ధవన్ ఈ మ్యాచ్లో కూడా ఆడటం అనుమానంగా ఉంది.
ధవన్ ఆడకపోతే పంజాబ్ బ్యాటింగ్ లైనప్ బలం సగం పడిపోతుంది. మాథ్యూ షార్ట్పై ఆ భారం పడుతోంది. కెప్టెన్గా శామ్ కర్రాన్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. కానీ పంజాబ్ వద్ద బలమైన స్పిన్నర్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఆర్సీబీ బ్యాటర్లకు ఉన్న ప్రధాన సమస్య స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడమే. స్పిన్ను ఎదుర్కోవడానికి వాళ్లు తడబడతారు. అలాంటిది పంజాబ్ వద్ద నిఖార్సయిన స్పిన్ బౌలింగ్ ఎటాక్ లేకుండా పోయింది.

రాహుల్ చాహర్ ఈ ఏడాది ఆరంభం నుంచి పెద్ద ప్రమాదకరంగా కనిపించడం లేదు. ఆర్సీబీపై రికార్డు బాగున్న హర్ప్రీత్ బ్రార్ కూడా నిలకడగా వికెట్లు తీసుకోవడం లేదు. ఇదే సమయంలో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తన స్పిన్ బ్యాటింగ్ను చాలా మెరుగు పరుచుకున్నాడు. ఇక మ్యాక్స్వెల్ కూడా సూపర్ ఫామ్లో కనిపిస్తున్నాడు. స్పిన్ను ఎదుర్కోవడానికే మహిపాల్ లోమ్రోర్ను మిడిల్లో తీసుకొస్తోంది ఆర్సీబీ.
కానీ లోమ్రోర్ అంత గొప్పగా ఏం రాణించడం లేదు. సూయష్ ప్రభుదేశాయికి కూడా అవకాశాలు ఇవ్వాలి. అతను చెన్నైపై ఫినిషర్ రోల్ సరిగా పోషించలేకపోయాడు. కానీ మంచి మిడిలార్డర్ బ్యాటర్ అయ్యే సత్తా ఉందని నిరూపించాడు. మరి ఈ మ్యాచ్లో కూడా లోమ్రోర్నే ఆడిస్తారా? లేక సూయష్కు అవకాశం ఇస్తారా చూడాలి. అలాగే వానిందు హసరంగకు బ్యాటింగ్ చేసే అవకాశం అందించాలి.
ఆర్సీబీ ప్రధాన స్పిన్నర్ అయిన హసరంగ తను ఆడిన రెండు మ్యాచుల్లో అంత గొప్పగా బౌలింగ్ చేయలేదు. అదే సమయంలో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ఇవ్వలేదు. ఆ కారణంగానే చెన్నై చేతిలో ఆర్సీబీ ఓడిందని చాలా మంది నిపుణులు కూడా అన్నారు. ఇక ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం పంజాబ్కు ఉంది. అయితే ధవన్ లేని లోటు ఆ జట్టును దెబ్బతీస్తుంది. అతను లేకుండా మరో విజయాన్ని పొందడం అంత ఈజీ కాదు.