ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసిన కామెరూన్ గ్రీన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అటు బ్యాటుతో, ఇటు బంతితో రెండు విభాగాల్లో చేతులెత్తేశాడు. ఇదంతా చూసిన కొందరు ఫ్యాన్స్ ఇదంతా ముంబై ఇండియన్స్ శాపం అంటున్నారు. గత రెండేళ్లుగా ఎంఐని ఈ శాపం వెంటాడుతోందని వాదిస్తున్నారు. ఆ జట్టు ఏ ఆటగాడినైనా భారీ ధరకు కొనుగోలు చేస్తే ఆ ప్లేయర్ అత్యంత దారుణంగా ఫెయిల్ అవడమే ఈ శాపం. ముఖ్యంగా గడిచిన రెండేళ్లుగా ఇదే కథ రిపీట్ అవుతోంది.
2018లో ముంబై తరఫున అత్యధిక ధర పలికిన ఆటగాడు హార్దిక్ పాండ్యా. అతన్ని ఏకంగా రూ. 11 కోట్లకు ముంబై దక్కించుకుంది. అతను ఆ ఏడాది ఫర్వాలేదనిపించాడు. 2021 వరకు ముంబైతో ఉన్న పాండ్యా.. ఆ ఏడాది ఐపీఎల్తో ముంబై ఇండియన్స్కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత 2022లో ఐపీఎల్ మెగా వేలం జరిగింది. ఈ వేలానికన్నా ముందే పాండ్యాను గుజరాత్ టైటాన్స్ కొనేసింది. అలాగే ముంబై ఇండియన్స్ కూడా తమ కెప్టెన్ రోహిత్ శర్మను రూ.16 కోట్లు ఖర్చుచేసి తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. ఇక వేలంలో మిగతా జట్లతో గట్టిగా పోటీ పడి మరీ ఇషాన్ కిషన్ కోసం ఏకంగా రూ.15.25 కోట్లు ఖర్చు చేసింది.

ఆ ఏడాది ఐపీఎల్లో ముంబై జట్టులో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు రోహిత్ శర్మ (రూ.16 కోట్లు), ఇషాన్ కిషన్ (రూ.15.25 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ.12 కోట్లు). వీరిలో రోహిత్, బుమ్రాను ముంబై రిటైన్ చేసుకోగా.. ఇషాన్ కిషన్ను వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే గతేడాది వీళ్లు ముగ్గురూ ఎంత ఘోరంగా విఫలం అయ్యారో అందరికీ తెలిసిందే. గతేడాది ఐపీఎల్లో రోహిత్ శర్మ సగటు 19 మాత్రమే. ఇక బుమ్రా కూడా పెద్దగా ప్రభావం చూపలేదు.గత ఐపీఎల్ తొలి మ్యాచులో రాణించిన ఇషాన్ కిషన్ కూడా ఆ తర్వాత ఏమాత్రం ఆడలేదు.
ఇక గతేడాది చివర్లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కూడా ముంబై ఇలాగే భారీ ధరకు కామెరూన్ గ్రీన్ను కొనుగోలు చేసింది. అతని కోసం రూ.17.5 కోట్లు ఖర్చు పెట్టింది. ఆర్సీబీతో ఆడిన మ్యాచ్ అతనికి ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్. ఈ మ్యాచ్లో కేవలం ఐదు పరుగులు చేసిన గ్రీన్.. బౌలింగ్లో కూడా తేలిపోయాడు. ఇదంతా చూస్తే.. ముంబై ఫ్రాంచైజీ భారీ ధర చెల్లించే ఆటగాళ్లు ఫెయిలవడం గ్యారంటీ అనిపిస్తోందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే గ్రీన్ మిగతా సీజన్లో ఎలా రాణిస్తాడో చూడకుండా అప్పుడే ఇలాంటి కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని మరికొందరు చెప్తున్నారు.