చాలా కాలం తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ అభిమానులకు తెగ ఉత్సాహం పంచింది. ఆర్సీబీ హోం గ్రౌండ్లో ముంబైకి పరాభవం తప్పలేదు. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న రెండు జట్లు విజయం సాధించాలని పట్టుదలగా ఆడాయి. కానీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన బెంగళూరు ముందు ముంబై చిన్నబోయింది. ఈ మ్యాచ్లో జరిగిన కొన్ని ఘటనలు అభిమానులను సీట్లలో కుదురుగా కూర్చోనివ్వలేదు. అలాంటి ఘటనలు ఏవో ఒకసారి చూస్తే..
కామెరూన్కు రెడ్ లైట్: ఈ ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన కామెరూన్ గ్రీన్కు తొలి మ్యాచ్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇషాన్ కిషన్ అవుటైన తర్వాత భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన అతను.. ఒకే ఒక్క బౌండరీ కొట్టి అవుటయ్యాడు. ఇదే మ్యాచ్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లే వేసిన యార్కర్కు గ్రీన్ బలయ్యాడు. ఇన్స్వింగర్ యార్కర్ను ఆఫ్సైడ్ ఆడేందుకు గ్రీన్ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. ఎన్నో అంచనాలతో భారీ ధరకు కొనుగోలు చేసిన గ్రీన్ కేవలం 5 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ సంతోషంతో చిందులేస్తే.. ముంబై అభిమానులు నెత్తిన చేతులు పెట్టుకున్నారు.

సిరాజ్, డీకే ఢీ: ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఏమాత్రం ఆకట్టుకోలేదు. క్రీజులో ఉన్నంతసేపూ ఇబ్బందిగానే కదిలాడు. అదే సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన మహమ్మద్ సిరాజ్.. రోహిత్ను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశాడు. షార్ట్ బాల్తో రోహిత్ను ఊరించాడు. దీంతో భారీ పుల్ షాట్ ఆడేందుకు హిట్మ్యాన్ ట్రై చేశాడు. కానీ బంతి సరిగా బ్యాటుకు కనెక్ట్ కాలేదు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. దాన్ని అందుకోవడానికి కీపర్ దినేష్ కార్తీక్ పరిగెత్తుకొచ్చాడు.
అదే సమయంలో సిరాజ్ కూడా క్యాచ్ కోసం దూసుకెళ్లాడు. చిన్నస్వామి స్టేడియంలోని ఫ్యాన్స్ అందరూ ఇది చూసి గోల చేశారు. దీంతో కమ్యూనికేషన్ దెబ్బతిన్న ఈ ఇద్దరూ బలంగా ఢీకొన్నారు. అయితే ఎవరికీ పెద్దగా గాయాలవలేదు. క్యాచ్ మాత్రం మిస్ అయింది. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోలేకపోయిన రోహిత్ (1) ఆ తర్వాత కాసేపటికే కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
కోహ్లీ ఊచకోత: ముంబై జట్టులో మెయిన్ బౌలర్ ఎవరు? అంటే టక్కున చెప్పే పేరు జోఫ్రా ఆర్చర్. ఎంఐ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న అతను.. తన మొదటి ఓవర్లోనే కోహ్లీని అవుట్ చేయాల్సింది. కోహ్లీ ఇచ్చిన కఠినమైన రిటర్న్ క్యాచ్ను ఆర్చర్ అందుకోలేకపోయాడు. అదొక్కటే కోహ్లీ అతనికి ఇచ్చిన అవకాశం. ఆ తర్వాత ఆర్చర్ బౌలింగ్లో కోహ్లీ రెచ్చిపోయాడు.
తనను కింగ్ కోహ్లీ అని ఎందుకు పిలుస్తారో నిరూపించుకున్నాడు. ఆర్చర్ బౌలింగ్లో ఏకంగా 28 పరుగులు చేశాడు. ఒక టీ20 మ్యాచులో ఆర్చర్పై ఇన్ని పరుగులు ఏ బ్యాటరూ చేయలేదు. కోహ్లీ ఊచకోతతో ఆర్చర్.. ముంబై తరఫున తన అరంగేట్ర మ్యాచులో ఒక్క వికెట్ తీయకుండా 33 పరుగులు సమర్పించుకున్నాడు.