లక్నో, బెంగళూరు మధ్య జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో చివరకు విజయం లక్నోనే వరించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సబీ బ్యాటర్లు చెలరేగారు. కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ ముగ్గురూ ధనాధన్ ఇన్నింగ్స్లతో హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో ఆ జట్టు 212 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ లక్ష్య ఛేదనలో స్టోయినిస్ (65), పూరన్ (62) చెలరేగడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో ఈ మ్యాచ్లో బద్దలైన రికార్డులు ఏవో చూస్తే..
డివిలియర్స్ను దాటేశాడుగా..:ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. స్లోగా ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అతను 46 బంతుల్లో 79 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఆర్సీబీ వెటరన్ డివిలియర్స్ రికార్డు బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో వేగం 3500 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. డివిలియర్స్ ఈ మైలురాయిని చేరుకోవడానికి 119 ఇన్నింగ్సులు పట్టింది. ఈ జాబితాలో 97 ఇన్నింగ్సులతో కేఎల్ రాహుల్ అగ్రస్థానంలో ఉన్నాడు. డుప్లెసిస్ 112 ఇన్నింగ్సుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

చెన్నై రికార్డు బద్దలు..:భారీ లక్ష్య ఛేదనలో మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత తేరుకోవడం అంటే మాటలు కాదు. కానీ లక్నో అదే చేసింది. ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. లక్నో ఒకానొక సమయంలో 23/3 స్కోరుతో కష్టాల్లో నిలిచింది. అయితే మూడు వికెట్లు పడిన తర్వాత 190 పరుగులు చేసింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ఇంతకుముందు పంజాబ్తో మ్యాచ్లో చెన్నూ కూడా మూడు వికెట్లు పడిన తర్వాత చెలరేగింది. ఆ మ్యాచ్లో 57/3తో ఉన్న జట్టు చివరకు 240/5 పరుగుల భారీ స్కోరు చేసింది. అంటూ మూడో వికెట్ పడిన తర్వాత 178 పరుగులు చేసిందన్నమాట. ఈ రికార్డును లక్నో బద్దలు కొట్టింది.
హర్షల్ పటేల్ కూడా..:ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసుకున్న భారత బౌలర్ల జాబితాలో హర్షల్ పటేల్ అగ్రస్థానం సంపాదించాడు. లక్నోతో జరిగిన మ్యాచులో రెండు వికెట్లు తీసుకున్న అతను.. కేవలం 79 ఇన్నింగ్సుల్లోనే 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉండేది. అతను 81 ఇన్నింగ్సుల్లో 100 వికెట్లు తీసుకున్నాడు. ఇక అమిత్ మిశ్రా, ఆశిష్ నెహ్రా, యుజ్వేంద్ర చాహల్ ముగ్గురూ కూడా ఈ మైలురాయిని చేరుకోవడానికి 83 ఇన్నింగ్సులు పట్టింది.