లక్నో, బెంగళూరు మధ్య మ్యాచ్ తర్వాత రెండు జట్ల ప్లేయర్ల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇలా గొడవ పడినందుకు కోహ్లీ, గంభీర్, నవీన్ ఉల్ హక్కు బీసీసీఐ ఫైన్ కూడా వేసింది. అయితే అసలు ఈ గొడవ ఎందుకు మొదలైందని చాలా మంది రకరకాల విషయాలు చెప్తున్నారు. ఇలా కొందరు చెప్తున్న వివరాల ప్రకారం ఈ గొడవకు కారణం నవీన్ ఉల్ హకే.
ఈ మ్యాచ్ ఛేజింగ్లో 17వ ఓవర్లు సిరాజ్ బౌలింగ్ చేశాడు. అప్పుడు క్రీజులో అమిత్ మిశ్రా, నవీన్ ఉల్ హక్ ఉన్నారు. వికెట్ తీయడానికి వీళ్లను షార్ట్ బాల్తో ఇబ్బంది పెట్టాలని సిరాజ్కు కోహ్లీ సలహా ఇచ్చాడట. ఆ ఓవర్లో సిరాజ్ వేసిన తొలి షార్ట్ బాల్.. మిశ్రా బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ వెళ్లింది. ఈ క్రమంలో కోహ్లీ సలహా విన్న నవీన్ ఉల్ హక్ ఏదో కామెంట్ చేశాడని తెలుస్తోంది.

నవీన్ ఉల్ హక్ అన్న మాటలకు కోహ్లీ, సిరాజ్ ఇద్దరికీ చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఆ ఓవర్ చివర్లో నవీన్ ఉల్ హక్ క్రీజులోనే ఉన్నా కూడా.. సిరాజ్ తన ఎదురుగా ఉన్న బంతి తీసుకొని నవీన్ వైపు సీరియస్గా చూసి వికెట్లపైకి విసిరేసి వెళ్లాడు. దీంతో నవీన్ ఉల్ హక్ మరింత కోపంగా కామెంట్స్ చేశాడు. ఇది చూసిన కోహ్లీ రంగంలోకి దిగి నవీన్పై సీరియస్ అయ్యాడు.
వీళ్లిద్దరి మధ్య గొడవ చూసిన మిశ్రా మధ్యలో వచ్చి కోహ్లీని వెనక్కు పంపే ప్రయత్నం చేశాడు. అప్పటికీ నవీన్ తన వాగుడు ఆపలేదు. దీంతో మిశ్రాను కూడా కోహ్లీ లెక్క చేయకుండా మరింత అగ్రెసివ్గా నవీన్కు వార్నింగ్ ఇచ్చాడు. ఇదంతా అయిపోయిన తర్వాత.. మ్యాచ్ ముగిసింది. అప్పుడు అందరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం ఆనవాయితీ.
ఈ సమయంలో మరోసారి కోహ్లీకి నవీన్ ఉల్ హక్ ఏదో వార్నింగ్ ఇచ్చాడు. దీనికి కోహ్లీ కూడా దీటుగా బదులిచ్చాడు. నవీన్ మరేదో అనబోతుంటే మ్యాక్స్వెల్ అడ్డుకున్నాడు. ఇదంతా చూసిన గంభీర్ వచ్చీ రావడంతోనే అంపైర్లను దీనిపై ప్రశ్నించాడు. ఆర్సీబీ ఆటగాళ్లకు సరిగా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. చాలా చిరాగ్గా కనిపించాడు.
ఇదంతా అయిపోయిన తర్వాత లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్, కోహ్లీ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ గొడవ గురించే మేయర్స్ ఏదో చెప్తున్నట్లు అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థం అవుతోంది. ఇలా కోహ్లీతో అతను మాట్లాడటం చూసిన గంభీర్.. అతన్ని పిలిచి, సీరియస్గా పక్కకు తీసుకెళ్లిపోయాడు. దీంతో కోహ్లీకి చిరాకేసింది. ఏదో అంటూ తన టీంమేట్స్ దగ్గరకు వెళ్లిపోయాడు.
అతను ఏమన్నాడో వినిపించని గంభీర్ కోపంగా వెనక్కు తిరిగి ఏంటి? అంటూ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాడు. పక్క వాళ్లు ఆపుతున్నా కూడా వేగంగా కోహ్లీ మీదకు వచ్చాడు. అతను తన దగ్గరకు రాగానే తన వైపు వివరణ ఇచ్చేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. ఆ సమయంలో గంభీర్ అన్న ఏదో డైలాగ్తో కోహ్లీకి కూడా కోపం వచ్చింది. అతను కూడా మాటతూలాడు.
ఇష్యూ సీరియస్ టర్న్ తీసుకుంటుందని గమనించిన అమిత్ మిశ్రా వెంటనే మధ్యలో దూరి కోహ్లీని వెనక్కు నెట్టాడు. అతని టీంమేట్స్ కోహ్లీని పక్కకు తీసుకెళ్లిపోయారు. గంభీర్ను కూడా అతని టీం సభ్యులు వెనక్కు తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత రాహుల్తో మాట్లాడిన కోహ్లీ.. రాహుల్ గాయం గురించి పరామర్శించాడు. అలాగే అతను ఈ విషయంపై తన అభిప్రాయం చెప్తుంటే విన్నాడు.
అతనికి తన వైపు ఆర్గ్యుమెంట్ కూడా చెప్పాడు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న నవీన్ ఉల్ హక్.. కోహ్లీ వైపు సీరియస్గా చూస్తూ పక్కకు వెళ్లిపోయాడు. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం సభ్యులు అటుగా వస్తే కోహ్లీ వాళ్ల దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ పలకరించాడు. ఇదంతా చూస్తుంటే.. అసలు సమస్య నవీన్ ఉల్ హక్, మహమ్మద్ సిరాజ్ దగ్గరే మొదలైనట్లు తెలుస్తోంది.