రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి మరో గట్టి షాక్ తగిలింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ విజేతగా నిలిచింది. 213 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన లక్నోను ఆరంభంలో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. కానీ మిడిల్ ఓవర్లలో మార్కస్ స్టొయినిస్, నికోలస్ పూరన్ ఇద్దరూ చెలరేగడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా స్టొయినిస్, పూరన్ వల్లనే గెలిచే మ్యాచ్లో ఓడామని ఒప్పుకున్నాడు. స్టొయినిస్ కేవలం 25 బంతుల్లోనే బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకోగా.. పూరన్ ఏకంగా 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించడం విశేషం. ఈ విజయం అనంతరం మాట్లాడిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా క్రెడిట్ మొత్తం వాళ్లిద్దరికే ఇచ్చాడు. తాము వేలంలో వీరిపై అంత పెట్టుబడి పెట్టిన కారణం ఇదేనన్నాడు.

'అస్సలు నమ్మలేకపోతున్నా. నేను చిన్నస్వామి స్టేడియంలోనే పెరిగా. ఇక్కడ చాలా మ్యాచులు చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేం. మేం స్టార్టింగ్లో ఉన్న పొజిషన్ నుంచి చూసుకుంటే.. 210 పరుగులపైగా స్కోర్ను ఛేజ్ చేస్తున్నామంటేనే భారీ షాట్లు ఆడేందుకు ట్రై చేయాలి. కానీ అలా చేసేప్పుడు వికెట్లు పోవడం కూడా సహజమే. పవర్ప్లేలో వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ స్టొయినిస్, పూరన్ ఆడిన విధానం సూపర్' అని రాహుల్ మెచ్చుకున్నాడు.
పూరన్, స్టొయినిస్ వల్లనే తాము రెండు పాయింట్లు పొందగలిగామని చెప్పాడు. 'నేను మరిన్ని పరుగులు చేస్తే నా స్ట్రైక్ రేటు మెరుగవుతుంది. కానీ పరిస్థితికి తగ్గట్లు ఆడేందుకు ప్రయత్నించా. పూరన్తో కలిసి క్రీజులో ఉండి ఉంటే ఇంకా త్వరగా మ్యాచ్ ముగిసేది. ఎప్పుడైనా 5,6,7 స్థానాల్లో బ్యాటర్లే మీకు ఇలాంటి మ్యాచులు గెలిపిస్తారు. ఎక్కువ పరుగులు చేసేది టాపార్డర్ అయినా.. విజయాలు అందించేది ఈ స్థానంలో వచ్చే బ్యాటర్లే. అందుకే మేం స్టొయినిస్, పూరన్ కోసం భారీగా ఖర్చు చేశాం. బదోనీ ఇప్పుడిప్పుడే మ్యాచులు ఫినిష్ చేయడం నేర్చుకుంటున్నాడు' అని పేర్కొన్నాడు.