ఆర్సీబీతో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్లో చివరకు లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. మార్కస్ స్టొయినిస్ (30 బంతుల్లో 65), నికోలస్ పూరన్ (19 బంతుల్ల 62) చెలరేగడంతో ఆర్సీబీ నిర్దేశించిన భారీ లక్ష్యం చిన్నబోయింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ టాప్-3 బ్యాటర్లు చెలరేగడంతో 212 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో చివరి బంతికి పెద్ద డ్రామానే జరిగింది. అప్పటికే లక్నో జట్టు 9 వికెట్లు కోల్పోయింది. క్రీజులో ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయి ఉన్నారు. చివరి బంతికి ఒక్క పరుగు అవసరం ఉంది. దీంతో హర్షల్ పటేల్ బౌలింగ్ చేసే సమయంలో నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉన్న రవి బిష్ణోయి క్రీజు వదిలి ముందుకు వెళ్లిపోయాడు. ఇది చూసిన హర్షల్ పటేల్.. అతన్ని మన్కడింగ్ చేద్దామని ప్రయత్నించాడు. అయితే బంతి వికెట్లను తాకలేదు. అతను వికెట్లను మిస్ చేశాడు.

ఇలా వికెట్లను మిస్ చేసి ముందుకు వెళ్లిపోయిన హర్షల్ వెంటనే వెనక్కు తిరిగి వికెట్లను కూల్చాడు. అయితే అప్పటికే అతను బౌలింగ్ క్రీజ్ దాటేయడంతో అంపైర్ దాన్ని నాటౌట్గా ప్రకటించాడు. ఆ తర్వాత హర్షల్ చివరి బంతి వేశాడు. దాన్ని కొట్టడంలో ఆవేష్ ఖాన్ విఫలమయ్యాడు. అయితే వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆ బంతిని కలెక్ట్ చేయడంలో తడబడ్డాడు. బంతిని కలెక్ట్ చేసి త్రో వేయడంలో అతను విఫలం అవడంతో.. ఆవేష్ ఖాన్ పరుగుకు వెళ్లిపోయాడు.
బిష్ణోయి డైవ్ చేసి మరీ రన్ పూర్తి చేశాడు. దీంతో చివరి బంతికి లక్నో విజయం సాధించింది. ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్లో బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు. అయితే ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్పై విమర్శలు వస్తున్నాయి. కర్ణ్ శర్మ కూడా భారీగానే పరుగులు ఇచ్చినా అతను మార్కస్ స్టొయినిస్ను అవుట్ చేశాడు. దాంతో పూరన్పై కూడా అతన్ని ప్రయోగించగా ఆ వ్యూహం బెడిసి కొట్టింది.
కానీ హర్షల్ అలా కాదు చివర్లో టెయిలెండర్లు తప్ప అందరూ అతని బౌలింగ్లో బాదేస్తున్నారు. స్టొయినిస్, పూరన్ సహా బ్యాటర్లు అందరూ హర్షల్ పటేల్ బౌలింగ్లో భారీ షాట్లు ఆడుతున్నారు. ఒకప్పుడు స్లో బాల్స్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన హర్షల్.. ఇప్పుడు మరీ ఎక్కువగా వాటిపై ఆధారపడి తన కెరీర్ నాశనం చేసుకుంటున్నాడని కొందరు నిపుణులు కూడా అంటున్నారు. ఇదంతా చూసిన చాలా మంది ఫ్యాన్స్.. హర్షల్ను జట్టులో నుంచి తీసేసిన రోజునే ఆర్సీబీ బాగు పడుతుందని విమర్శలు చేస్తున్నారు.