ఐపీఎల్లో అత్యంత థ్రిల్లింగ్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్లో చివరి వరకు ఉత్కంఠగా జరిగింది. ఈ మ్యాచ్లో భారీ స్కోరు చేసినా కూడా బెంగళూరు గెలవలేకపోయింది. దీంతో ఆర్సీబీ అభిమానులు నిరాశ చెందారు. చాలా మంది స్టేడియంలోనే ఏడ్చేశారు కూడా. ఈ క్రమంలో గౌతం గంభీర్ చేసిన పని వైరల్ అవుతోంది.
చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైన సమయంలో.. హర్షల్ వేసిన డెలివరీని ఆర్సీబీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అందుకోలేకపోయాడు. అతను తడబడటంతో ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయి ఇద్దరూ పరుగు పూర్తి చేసి లక్నోకు విజయాన్ని అందించారు. అంతకుముందు ఆర్సీబీ బ్యాటర్లు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో ఆ జట్టు 212 పరుగుల భారీ స్కోరు చేసింది. అప్పుడు చిన్నస్వామి స్టేడియంలో ఉన్న అభిమానులు అందరూ 'ఆర్సీబీ.. ఆర్సీబీ..' అంటూ నినాదాలతో హోరెత్తించారు.

దీంతో చిర్రెత్తిన లక్నో హెడ్ కోచ్ గౌతం గంభీర్ చాలా టెన్షన్ పడ్డాడు. కానీ చివరి బంతికి ఆ జట్టు గెలవడంతో గంభీర్ తెగ సంతోషించాడు. ఈ క్రమంలోనే స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల వైపు చూసి సైలెంట్గా ఉండాలంటూ సైగలు చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్లో థ్రిల్లింగ్ విజయం తర్వాత గంభీర్ మంచి ఆవేశంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆర్సీబీ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని కూడా గంభీర్ కలిశాడు.
అతనితోపాటు లక్నో కోచింగ్ సిబ్బందిలో ఒకడైన విజయ్ దహియా కూడా ఉన్నాడు. ఈ ముగ్గురూ కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ బాయ్స్ అందరూ ఒకే చోటకు చేరారని ఈ ఫొటోలపై కామెంట్లు చేస్తున్నారు. అంతకుముందు ఐపీఎల్ సందర్భంగా ఒకసారి గంభీర్, కోహ్లీ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కోహ్లీపై గంభీర్ చాలా సార్లు చాలా కఠినంగా మాట్లాడి విమర్శలపాలు అయ్యాడు.