కొన్ని రోజుల క్రితం ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో 212 పరుగుల భారీ స్కోరు చేసినా కూడా లక్ష్యాన్న కాపాడుకోవడంలో ఆర్సీబీ విఫలమైంది. స్టొయినిస్, పూరన్ చెలరేగడంతో లక్నో అద్భుతమైన విజయం సాధించింది. ఇలా లక్నో గెలిచినా, ఆర్సీబీ ఓడినా పెద్ద ఇష్యూ ఉండేది కాదు.
ఆ మ్యాచ్ చివరి బంతికి ఒక్క పరుగు అవసరమైన స్థితిలో.. హర్షల్ పటేల్ వేసిన బంతిని ఆవేష్ ఖాన్ మిస్ చేశాడు. కీపర్ దినేశ్ కార్తీక్ కూడా దాన్ని సరిగా అందుకోలేకపోయాడు. దీంతో ఆవేష్ ఖాన్ సింగిల్ పూర్తి చేశాడు. ఆ పరుగు పూర్తి చేసిన వెంటనే తన హెల్మెట్ తీసి నేలకేసి బాది ఆవేష్ సెలబ్రేట్ చేసుకున్నాడు.

అప్పుడు నాన్స్ట్రైకర్ ఎండలో ఉన్న రవి బిష్ణోయి కూడా గట్టిగా కేకలు వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోకి పరిగెత్తుకు వచ్చిన గంభీర్.. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ వైపు చూసి నోటిపై వేలుంచుకొని 'సైలెంట్' అన్నట్లుగా సైగలు చేశాడు. ఇదంతా చూసిన ఫ్యాన్స్ కూడా లక్నో టీం మరీ అతి చేసినట్లే ఫీలయ్యారు.
అంతకుముందు భారీ ఇన్నింగ్స్ ఆడిన నికోలస్ పూరన్ కూడా ఇలాంటిదే ఒక పని చేశాడు. అతను అవుటయ్యే సమయానికి లక్నో ఛేజింగ్ దాదాపు అదుపులోకి వచ్చేసింది. ఈ క్రమంలో మైదానాన్ని వీడుతూ చిన్నస్వామిలోని ఆర్సీబీ సపోర్టర్లకు ఫ్లైయింగ్ కిస్లు పంపించాడీ విండీస్ ప్లేయర్.
ఈ క్రమంలోనే లక్నో వేదికగా ఈ రెండు జట్లు మళ్లీ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో అప్పుడు లక్నో ప్లేయర్లు చేసిన అతి చేష్టలకు కోహ్లీ ఒక్కడే బదులిచ్చాడు. ఆయుష్ బదోనీ క్యాచ్ అందుకోగానే నోటిపై వేలుంచుకొని లక్నో ఫ్యాన్స్ సైలెంట్గా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. అలాగే తను క్యాచ్ అందుకున్న ప్రతిసారీ ఎగ్రెసివ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
మరో క్యాచ్ అందుకున్నప్పుడు తను కూడా ప్రేక్షకులకు ఫ్లైయింగ్ కిస్లు పంపించాడు కోహ్లీ. ఇదంతా చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం క్రితం చూసిన ఎగ్రెసివ్ కోహ్లీని మళ్లీ చూస్తున్నామని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.