క్రికెట్లో ఐపీఎల్కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఆర్సీబీ, సీఎస్కే, ఎంఐ వంటి జట్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మరీ ఎక్కువ. ఈ జట్లు ఆడే మ్యాచులు చూసేందుకు వందల కిలోమీటర్ల దూరం నుంచి అభిమానులు వెల్లువలా వస్తుంటారు. లక్నో, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్లో కూడా అలాగే జరిగింది. చిన్నస్వామి స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది.
చివరకు ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓటమిపాలైంది. 212 పరుగుల భారీ స్కోరు చేసినా కూడా దాన్ని కాపాడుకోలేకపోయిన బెంగళూరు.. చివరకు చేతులెత్తేసింది. దీంతో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ టీం ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇలా ఒక అమ్మాయి గుక్కపట్టి ఏడుస్తున్న ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఆమెను ఒక మీమ్ మెటీరియల్లా ఫ్యాన్స్ వాడుతున్నారు. ఆర్సీబీని ఎగతాళి చేయడానికి, ఆ టీంను ట్రోల్ చేయడానికి ఆమె ఫొటోలను వాడుకుంటున్నారు. ఆమెపై కూడా మీమ్స్ చేస్తూ ఆనందిస్తున్నారు. దీనిపై మరో ట్విట్టర్ అకౌంట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రికెట్ అభిమానులు ఇంత దిగజారాలా? అని నిలదీసింది. ఈ అమ్మాయి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిందని, ఆమెను ఇలా ట్రోల్ మెటీరియల్గా వాడుకోవడం చాలా దారుణమని తెలిపింది.
'ఈ అమ్మాయి ఆర్సీబీ మ్యాచ్ చూసేందుకు 657 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చింది. ఆర్సీబీ గెలిస్తే చూడాలని ఖరీదైన టికెట్ కూడా కొన్నది. ఒక ఆటో డ్రైవర్ కుమార్తె అయ్యుండీ లైవ్ల మ్యాచ్ చూసేందుకు చాలా కష్టపడి వచ్చింది. ఇప్పుడు ఆమెపై కొందరు మీమ్స్ చేస్తున్నారు. అసలు ప్రజలు ఈ రోజుల్లో ఇంతగా ఎందుకు దిగజారుతున్నారు?' అని సదరు ట్విట్టర్ అకౌంట్ ప్రశ్నించింది. అయితే దీనిపై కూడా కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.