లక్నోతో జరిగిన మ్యాచ్లో చివరి బంతికి ఓడిన ఆర్సీబీకి మరో షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలింగ్ ఎంత చెత్తగా ఉందో మరోసారి బయటపడింది. ఈ క్రమంలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఎవరి చేతికి బంతి అందించినా వాళ్లు బాదించుకున్నారు. దీంతో బౌలింగ్ ఎవరికి ఇవ్వాలని డుప్లెసిస్ చాలా సుదీర్ఘంగా ఆలోచించుకోవాల్సి వచ్చింది. ధనాధన్ షాట్లతో విరుచుకుపడిన మార్కస్ స్టొయినిస్ (65)ను కర్ణ్ శర్మ అవుట్ చేశాడు.
అందుకని నికోలస్ పూరన్ క్రీజులో ఉన్నప్పుడు కూడా అతనికే బౌలింగ్ ఇచ్చాడు. కానీ కర్ణ్ బౌలింగ్లో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇక మిడిల్ ఓవర్లలో పరుగులు కట్టడి చేస్తాడనే ఆశతో హర్షల్ పటేల్కు బంతి అందించాడు. అతను కూడా మైదానం నలుమూలలా బౌండరీలు బాదించుకున్నాడు. దీంతో అసలు ఎవరి చేత బౌలింగ్ చేయించాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలోనే డుప్లెసిస్ ఎక్కువ సమయం తీసుకున్నాడట. దీంతో లక్నోతో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి అంపైర్లు ఫైన్ వేశారు. డుప్లెసిస్కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది విన్న ఆర్సీబీ అభిమానులకు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది. అసలే ఈ మ్యాచ్లో ఓడిపోయామని బాధ పడుతుంటే.. తమ కెప్టెన్పై జరిమానా కూడా పడటంతో వాళ్లు మరింత చిరాకు పడుతున్నారు. ఇంత బలహీనమైన బౌలింగ్తో ట్రోఫీ ఎలా నెగ్గుతామని ప్రశ్నిస్తున్నారు.
అలాగే ఈ మ్యాచ్లో లక్నో ప్లేయర్ ఆవేష్ ఖాన్పై కూడా అంపైర్లు సీరియస్ అయ్యారు. అతను ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అతనికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మ్యాచ్ గెలిచిన తర్వాత తన హెల్మెట్ తీసి విసిరేసి సెలబ్రేట్ చేసుకున్నాడు ఆవేష్. దీంతో లెవెల్ 1 తప్పిదం కింద అతనికి అంపైర్లు వార్నింగ్ ఇచ్చారు. తన తప్పును ఆవేష్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.