లక్నో, బెంగళూరు మ్యాచ్ తర్వాత మొదలైన గొడవ ఇంకా కొనసాగుతోంది. ఈ గొడవకు ప్రధాన కారకులైన నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా పరోక్ష కామెంట్స్ చేసుకుంటున్నారు. లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్, కోచ్ గౌతం గంభీర్తో కోహ్లీ గొడవ పడ్డాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. కొందరు కోహ్లీని తిడుతుండగా.. మరికొందరేమో కోహ్లీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్న బీసీసీఐ.. కోహ్లీ, గంభీర్, నవీన్ ఉల్ హక్ ముగ్గురికీ ఫైన్ వేసింది.

దీనిపై ఇన్స్టా స్టోరీ పోస్ట్ చేసిన నవీన్ ఉల్ హక్.. 'నీకు ఏది జరగాలో అది కచ్చితంగా జరుగుతుంది. ఇలానే అన్నీ జరగాలి, జరుగుతాయి కూడా' అంటూ నవ్వుతున్న ఎమోజీ షేర్ చేశాడు. అక్కడితో ఆగకుండా మ్యాచ్ మధ్యలో కోహ్లీ తన బూటు కింద మట్టి చూపించిన విషయాన్ని పరోక్షంగా గుర్తుచేశాడు.
'సలహాలు తీసుకోవడానికి గౌరవం ఇవ్వడానికి నేనెప్పుడూ రెడీ. క్రికెట్ అనేది జెంటిల్మెన్స్ గేమ్. ఎవరైనా వచ్చి మీరంతా నా కాళ్ల కింద మట్టి వంటి వాళ్లు. అలాగే ఉండిపోతారు అంటే.. అది నా గురించి మాత్రమే కాదు. నా ప్రజలను కూడా అవమానించినట్లే. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి' అని పోస్టు పెట్టాడు.
అదే సమయంలో కోహ్లీ కూడా తన వైపు నుంచి ఇన్స్టా స్టోరీని పంచుకున్నాడు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మనం వినేదంతా నిజం కాదు. అది జస్ట్ ఒపీనియన్ మాత్రమే. అలాగే మనకు కనిపించేది కూడా నిజం కాదు. అది ఒక కోణం మాత్రమే' అని మార్కస్ అరీలియస్ కొటేషేన్ షేర్ చేశాడు.
అలాగే ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆర్సీబీ డ్రెస్సింగ్ రూంలో కూడా దీనిపై కోహ్లీ కామెంట్ చేశాడు. 'నువ్వు ఏదైనా ఇచ్చేటప్పుడు.. తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. అలా లేనప్పుడు అసలు ఇవ్వకు' అంటూ పరోక్షంగా గంభీర్, లక్నో టీం యాటిడ్యూడ్పై కామెంట్ చేశాడు. చిన్నస్వామి స్టేడియంలో గెలిచినప్పుడు లక్నో టీం అంతా అతి చేష్టలు చేసిన సంగతి తెలిసిందే.