ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటి వరకు ట్రోఫీ నెగ్గని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. హేమాహేమీల వంటి ప్లేయర్లు ఉన్నా కూడా ఆ టీం ఇప్పటి వరకు ట్రోఫీ ఎందుకు గెలవలేదు? అనేది అభిమానుల్లో పెద్ద మిస్టరీగా మిగిలిన ప్రశ్న. అయితే ఈ ఏడాది మాత్రం ఆర్సీబీ జట్టు బలంగా కనిపిస్తోంది. ట్రోఫీ నెగ్గడానికి ఇదే ఆర్సీబీకి బెస్ట్ ఛాన్స్ అని చాలా మంది నిపుణులు అంటున్నారు.
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఫామ్లో ఉన్నట్లే కనిపిస్తున్నాడు. మైఖేల్ బ్రేస్వెల్ కూడా తనదైన రోజున ఎలాంటి ప్రత్యర్థికైనా ముచ్చెమటలు పట్టించగల ఆటగాడే. ఇక చివర్లో ఫినిషర్గా దినేష్ కార్తీక్ ఉండనే ఉన్నాడు. అయితే కీలకమైన బౌలర్లు గాయంతో జట్టుకు దూరం అవడంతో బౌలింగ్ మాత్రమే ఆర్సీబీ అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.

అయితే ఫ్యాన్స్ అభిమానం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా. మొన్నటి వరకు విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు. ఆ సమయంలో కోహ్లీ సెంచరీ చేస్తేనే తాము పెళ్లి చేసుకుంటామని బోర్డులు పట్టుకొని ఎందరో అభిమానులు క్రికెట్ మ్యాచులకు అటెండ్ అయ్యారు. ఆ ఫొటోలు చూసిన చాలా మంది ఇలాగైతే సదరు అభిమానులకు పెళ్లిళ్లు ఈ జీవితంలో కావని ఎగతాళి కూడా చేశారు. కానీ వాళ్లందరికీ బదులిచ్చేలా కోహ్లీ గతేడాది ఫామ్లోకి వచ్చిన తర్వాత ఐదు శతకాలు బాదాడు.
ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఆర్సీబీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నారు. కీలక ఆటగాళ్లు మంచి ఫామ్లో కూడా ఉండటంతో కచ్చితంగా ఆర్సీబీ ఈ ట్రోఫీ నెగ్గుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆర్సీబీ అభిమానులు.. తమ టీం ట్రోఫీ నెగ్గే వరకు తాము పెళ్లిళ్లు చేసుకోబోమని బోర్డులు రాసుకొని స్టేడియంలో కనిపిస్తున్నారు. ఇది చూసిన చాలా మంది కూడా ఇక జన్మలో వీళ్లకు పెళ్లిళ్లు కావంటూ జోకులు పేలుస్తున్నారు. మరి వీరి నోళ్లను కూడా కోహ్లీ ఈ ఏడాది మూయిస్తాడేమో చూడాలి.