ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారిన అంశం ఐపీఎల్ కాదు. లక్నో, బెంగళూరు మధ్య టీమ్స్ మధ్య జరిగిన గొడవే. విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ ఇద్దరికీ గతంలో కూడా ఇలా గొడవలు పడిన చరిత్ర ఉంది. దీంతో ఈ గొడవ ఫ్యాన్స్లో మరింత చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో అసలు ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ, గంభీర్ మధ్య జరిగిన సంభాషణ ఏంటనేది బయటకు వచ్చింది. ఒక ప్రముఖ వార్తా సంస్థ ఈ సంభాషణను వెల్లడించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీతో కైల్ మేయర్స్ మాట్లాడుతుండగా.. గంభీర్ వచ్చి అతన్ని పక్కకు లాక్కెళ్లిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అసలు ఈ గొడవలో ఏం జరిగిందనే విషయం నెమ్మదిగా బయట పడుతోంది. సిరాజ్ ఓవర్ ముగిసిన తర్వాత.. బౌలర్తో కోహ్లీ ఏదో మాట్లాడుతుండగా నవీన్ వచ్చి ఏదో కామెంట్ చేశాడు. దీంతో కోహ్లీకి కోపం వచ్చి సీరియస్గా రిప్లై ఇచ్చాడు. వీరి మధ్య మాటల యుద్ధం పెరగడంతో మిశ్రా వచ్చి కోహ్లీని వెనక్కు నెడుతూ గొడవను తగ్గించే ప్రయత్నం చేశాడు.
ఈ సమయంలో చెప్పాల్సింది తనకు కాదని, తన ప్లేయర్ అయిన నవీన్కు అని మిశ్రాతో కోహ్లీ గట్టిగా అన్నాడు. అప్పుడే కోహ్లీ తన షూస్తో పిచ్పై పరిగెత్తుతున్నాడని అంపైర్కు నవీన్ కంప్లయింట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది విన్న కోహ్లీ తన బూటు కింద ఉన్న మట్టిని చూపించి.. 'ఇది పిచ్పై మట్టా? మరి ఇదేంటి?' అంటూ తన షూస్కు అంటుకొని ఉన్న మైదానంలోని మట్టి బెడ్డలను తీసి విసిరి కొట్టాడు.

ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత లక్నో ఓపెనర్ కైల్ మేయర్స్తో కోహ్లీ మాట్లాడుతుండగా గంభీర్ వచ్చి మేయర్స్ను పక్కకు లాక్కెళ్లాడు. ఆ సమయంలో డగౌట్లో ఉన్న ఒక వ్యక్తి ఈ సంభాషణను బయట పెట్టాడు. కోహ్లీ తమపై ఎందుకు అంత ఎగ్రెషన్ చూపిస్తున్నాడని, అంత అవసరమా? అని మేయర్స్ అడిగాడట.
దీనికి బదులిచ్చిన కోహ్లీ.. నవీన్ తనతో ఎందుకు పెట్టుకోవాలి? తన వైపు స్టేర్ చేస్తూ రెచ్చగొట్టాలి? అని అడిగినట్లు తెలుస్తోంది. అలాగే తను ఎగ్రెసివ్గా ఉంటే తనను చూడాల్సిన అవసరం కూడా లక్నో ప్లేయర్స్కు లేదని, ఇగ్నోర్ చేయొచ్చు కదా అని కోహ్లీ చెప్పాడు. వీళ్ల సంభాషణ కూడా సీరియస్గా మారుతుందని అనుకున్న గంభీర్ వచ్చి మేయర్స్ను పక్కకు తీసుకెళ్లిపోయాడు. ఇది చూసిన కోహ్లీ ఏదో కామెంట్ చేశాడు. దీంతో గంభీర్కు కోపం వచ్చి రిటర్న్ వచ్చాడు.
'ఏం అంటున్నావ్ నువ్వు?' అంటూ కోహ్లీని అడిగాడు. 'నేను అసలు మిమ్మల్ని ఏం అనలేదు. మీరే మధ్యలో దూరుతున్నారు' అని కోహ్లీ చెప్పాడు. 'నువ్వు నా ప్లేయర్లను అబ్యూజ్ చేస్తున్నావు. వాళ్లు నా ఫ్యామిలీ వంటి వాళ్లు' అని గంభీర్ సీరియస్గా బదులిచ్చాడు. 'అప్పుడు మీ ఫ్యామిలీని మీరు కంట్రోల్లో పెట్టుకోండి' అని కోహ్లీ అన్నాడు. 'అంటే ఇప్పుడు నేను నీ దగ్గర నేర్చుకోవాలా?' అని గంభీర్ అడిగాడు.
దీంతో ఇష్యూ మరింత పెద్దది అయ్యేలా ఉందనుకున్న రెండు టీమ్స్.. ఈ ఇద్దరినీ వెనక్కు నెట్టేశాయి. అంతకుముందు మిశ్రా కూడా కోహ్లీ తమ ప్లేయర్ నవీన్తో దుర్భాషలాడుతున్నాడని అంపైర్లకు ఫిర్యాదు చేసినట్లు డగౌట్లో ఉన్న వ్యక్తి వెల్లడించాడు. అసలు ఈ గొడవంతా చిన్నపిల్లల గొడవలా ఉందని, చిన్నస్వామి స్టేడియంలో గంభీర్ చేసిన పని కూడా తప్పేనని అతను అభిప్రాయపడ్డాడు.
ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి కోహ్లీ కూడా అలాగే ఎగ్రెషన్ చూపించాడని అన్నాడు. కోహ్లీ కెప్టెన్సీని, ఆటను గంభీర్ చాలాసార్లు విమర్శించడం కూడా కోహ్లీకి తెలుసు కదా అని చెప్పాడు. గంభీర్ ఏం చెడ్డవాడు కాదని, కానీ అతన్ని భరించడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుందని తెలిపాడు. ఈ గొడవలో తమ వాళ్లదే కరెక్ట్ అని చెప్పుకోవడానికి గంభీర్, కోహ్లీ ఫ్యాన్స్ నెట్టింట తెగ గోల చేస్తున్నారు.
గంభీర్ పొలిటికల్ సెక్రటరీ గౌరవ్ అరోరా ఒక ట్వీట్లో.. 'గంభీర్ కుమార్తెలపై అసభ్య పదజాలంతో దాడి చేయాలని నీ ఫ్యాన్స్ను రెచ్చగొట్టడం చాలా నీచం. మ్యాచులు వస్తాయి, పోతాయి. కొంచెం క్లాస్ చూపించు కోహ్లీ' అంటూ కోహ్లీపై అనవసరమైన ట్వీట్ కూడా చేశాడు.
గంభీర్పై కోహ్లీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం వాస్తవమే. అదే సమయంలో గంభీర్ అంటే గౌరవం ఉన్న ఫ్యాన్స్.. కోహ్లీని కూడా తెగ ట్రోల్ చేశారు. గట్టిగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అయింది కోహ్లీనే. భారత మేటి బ్యాటర్లలో ఒకడైన అతన్ని 'కచరా కోహ్లీ' అంటూ చాలా మంది పోస్టులు పెట్టారు. అయితే ఇవన్నీ గంభీర్ చేయించినట్లా? కాదు కదా.
అలాగే గంభీర్పై విమర్శలు చేయాలని కూడా కోహ్లీ వెళ్లి చెప్పడు కదా. తమకు ఇష్టం ఉన్న వాళ్లను ఎవరైనా ఏమైనా అంటే.. వాస్తవాలు తెలుసుకోకుండా గుడ్డిగా విమర్శలు చేసే ఫ్యాన్సే ఇప్పుడు ఎక్కువైపోయారు. వారి చర్యలకు ఇలాంటి స్టార్లను బాధ్యులు చేయడం నిజంగా నీచం అని చెప్పాలి.