టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ, మాజీ స్టార్ గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవ హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. దీని వల్ల క్రికెట్పై గౌరవం పోతుందని కొందరు విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ కూడా వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
'వంద శాతం మ్యాచ్ ఫీజు ఫైన్ వేయడం ఏంటి? అసలు వంద శాతం అంటే ఎంత? కోహ్లీకి ఆర్సీబీ రూ.17 కోట్లు ఇస్తుంది అనుకుంటా. అతను ఈ లీగ్లో సెమీస్, ఫైనల్ కూడా కలుపుకుంటే పదహారు మ్యాచులు ఆడే అవకాశం ఉంది. అంటే మ్యాచ్కు రూ.కోటి వరకు పడుతుంది. అది నిజంగా చాలా కఠినమైన శిక్షే. గంభీర్ పరిస్థితి ఏంటో నాకు తెలీదు' అని గవాస్కర్ అన్నాడు.

'మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా బీసీసీఐ చర్యలు తీసుకోవాలి. ఇంత కఠినమైన ఫైన్ పడింది కాబట్టి మళ్లీ ఇలా జరగదని మనం అనుకుంటున్నాం. ఆటగాళ్ల మధ్య పోటీ తత్వం ఉండటం మంచిదే. మా రోజుల్లో కూడా కొన్ని మాటలు అనుకునే వాళ్లం. కానీ ఇంత ఎగ్రెషన్ ఎప్పుడూ లేదు. ప్రస్తుతం మైదానంలో జరిగేది అంతా టీవీలో వస్తోంది. ఈ కారణంగా ఈ ఆటగాళ్లు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నారు' అని అభిప్రాయపడ్డాడు.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదంటే ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని బీసీసీఐకి సన్నీ సూచనలు చేశాడు. 'మళ్లీ ఇలా జరగకుండా ఏదో ఒకటి చేయాలి. పదేళ్ల క్రితం హర్భజన్, శ్రీశాంత్ విషయంలో కొన్ని మ్యాచులు నిషేధం విధించారు. అలాగే ఇప్పుడు కూడా అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఇలాంటి ఘటనల వల్ల జట్టుకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి మళ్లీ జరగవు' అని వివరించాడు.