ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం అవ్వడానికి ముందు నుంచే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి. ఎన్నో అంచనాలతో మినీ వేలంలో కొనుగోలు చేసిన విల్ జాక్స్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. జోష్ హాజిల్వుడ్ కూడా గాయంతో సగం సీజన్ ఆడటం లేదని ప్రకటించేశాడు. ఇక ముంబైతో జరిగిన మ్యాచ్లో రీస్ టాప్లే గాయపడ్డాడు. తాజాగా యువ స్టార్ రజత్ పటీదార్ కూడా ఈ సీజన్కు దూరమయ్యాడు.
మడమ పైభాగంలో నొప్పితో బాధ పడుతున్న అతను.. ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్స్లో కూడా పాల్గొన్నాడు. కానీ మ్యాచ్ ఫిట్నెస్ లేకపోవడంతో అతన్ని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)కు పంపించారు. అక్కడ పలు స్కానింగ్లు తీసిన తర్వాత.. ఈ ఐపీఎల్ సీజన్లో ఆడటం రజత్ పటీదార్కు కుదరదని వైద్యులు తేల్చేశారు. ఈ వార్త ఆర్సీబీ అభిమానులకు గట్టి షాక్ ఇచ్చింది.

పటీదార్ ఈ సీజన్కు దూరమైనట్లు తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన ఆర్సీబీ.. అతనికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపింది. తమ కోచింగ్ స్టాఫ్ కూడా అతనికి అందుబాటులో ఉంటారని పేర్కొంది. ఈ వార్త విన్న అభిమానులు కూడా పటీదార్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ యువ స్టార్.. తన ఇన్స్టాలో ఎమోషనల్ పోస్టు పెట్టాడు.
'నేను ఈసారి చిన్నస్వామి స్టేడియంలో రెడ్ అండ్ గోల్డ్ ఆర్మీని చాలా మిస్ అవుతా. కానీ నేను ఎక్కడ ఉన్నా సరే.. మీరు గెలవాలనే కోరుకుంటూ చీర్ చేస్తుంటా. మళ్లీ కలిసే వరకూ..' అని పటీదార్ తన ఇన్స్టా స్టోరీని పంచుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయిపోతున్నారు. త్వరగా తిరిగి రా ఛాంప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతేడాది లక్నోతో జరిగిన ఎలిమినేటర్లో పటీదార్ అద్భుత శతకంతో జట్టును రెండో ఎలిమినేటర్ చేర్చాడు. అయితే అక్కడ రాజస్థాన్ చేతిలో ఓడిన ఆర్సీబీ ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే.