తమ చివరి లీగ్ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో చిత్తయింది. ఈ ఓటమితో ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ చేరడంలో ఆర్సీబీ విఫలమైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు విరాట్ కోహ్లీ మంచి స్కోరు అందించాడు.
ఆరంభం నుంచే గుజరాత్ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన అతను వరుసగా రెండో మ్యాచులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో కేవలం 61 బంతుల్లోనే 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే అతనికి మిగతా బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది. దీంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ అనుకున్నంత భారీ స్కోరు చేయలేకపోయింది. కేవలం 197 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇక ఛేజింగ్లో గుజరాత్ ఓపెనర్ శుభ్మన్ గిల్ (104 నాటౌట్) చెలరేగాడు. అతనికి విజయ్ శంకర్ (53) మంచి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ రాణించడంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే ఆర్సీబీని గుజరాత్ చిత్తుచేసింది. అయితే ఈ మ్యాచ్లో విజయ్ శంకర్ క్యాచ్ అందుకునే సమయంలో కోహ్లీకి గాయమైంది. ఈ కారణంగానే అతను చివరి ఓవర్లలో ఫీల్డింగ్ చేయకుండా డగౌట్లోకి వెళ్లిపోయి కూర్చున్నాడు.
ఇది చూసిన అభిమానులు చాలా టెన్షన్ పడ్డారు. కోహ్లీ గాయం తీవ్రమైంది ఏమో అని భయపడ్డారు. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ మాత్రం అలాంటిదేం లేదని, ఎవరూ టెన్షన్ పడక్కర్లేదని తెలిపాడు. 'కోహ్లీ మోకాలికి చిన్న గాయం అయిన మాట వాస్తవమే. కానీ అది అంత సీరియస్ కాదు' అని బంగర్ వివరించాడు. అలాగే కోహ్లీ ఆటతీరును, మైదానంలో నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెట్టడాన్ని మెచ్చుకున్నాడు.
'నాలుగు రోజుల వ్యవధిలో అతను రెండు సెంచరీలు బాదాడు. ఇదొక స్పెషల్ అచీవ్మెంట్. తను కేవలం బ్యాటుతోనే కాదు, ఫీల్డింగ్లోనూ జట్టుకు ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. అందుకే మైదానంలో ఎక్కువగా పరిగెడుతూనే ఉంటాడు.
రెండ్రోజుల క్రితం 40 ఓవర్లు ఆడిన అతను.. ఈ మ్యాచ్లో 35 ఓవర్లపాటు మైదానంలో ఉన్నాడు. తన బెస్ట్ ఆటనే ఆడాడు. తన వయసు 35 సంవత్సరాలు అని మర్చిపోకూడదు. కాబట్టి ఏదో ఒక సమయంలో ఇది ఇబ్బందిగా మారొచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఈ గాయం పెద్ద సమస్య అని నేను అనుకోవడం లేదు' అని బంగర్ వివరించాడు.