ఆర్సీబీకి మరోసారి నిరాశే మిగిలింది. ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బ్యాటింగ్ విభాగంలో అతనొక్కడే ఒంటరి పోరాటం చేశాడు.
మిగతా వాళ్లలో మైకేల్ బ్రేస్వెల్ (29), అనూజ్ రావత్ (25 నాటౌట్) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఒక పక్క వికెట్లు పడుతున్నా మరో పక్క అడ్డుగోడలా నిలిచిన కోహ్లీ ఆర్సీబీకి 197 పరుగుల భారీ స్కోరు అందించాడు. కానీ గుజరాత్ ఓపెనర్ శుభ్మన్ గిల్ (104 నాటౌట్) కూడా చెలరేగడంతో ఆర్సీబీ ఉంచిన 198 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. అతనితోపాటు విజయ్ శంకర్ (54) కూడా రాణించాడు.

వీళ్లిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యంతో గుజరాత్ను విజయం వైపు నడిపించారు. అయితే చివర్లో విజయ్, డేవిడ్ మిల్లర్ (0) వెంట వెంటనే అవుట్ అవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. కానీ చివరి ఓవర్లో బంతి అందుకున్న వేన్ పార్నెల్ తొలి బంతికే నోబాల్ వేశాడు. ఆ మరుసటి బంతి వైడ్ వేశాడు. తర్వాతి బంతికి గిల్ భారీ సిక్సర్ బాదడంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ విజయం సాధించింది.
ఈ ఓటమితో ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. అదే సమయంలో సన్రైజర్స్పై గెలిచిన ముంబై ప్లేఆఫ్స్ చేరింది. ఈ విజయంపై గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. 'మేం ప్లేఆఫ్స్కు ముందు కూడా మొమెంటం కావాలని అనుకున్నాం. ఒక బౌలర్గా చెప్పుకుంటే.. గిల్ ఎవరికీ ఛాన్స్ ఇవ్వడు. దీంతో మిగతా బ్యాటర్లకు కూడా కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. మేం ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేయాల్సింది' అని చెప్పాడు.
ఇక ఆర్సీబీ స్టార్ విరాట్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడని మెచ్చుకున్నాడు. అతని ఇన్నింగ్స్ చాలా స్పెషల్ అన్నాడు. అదే సమయంలో తమ జట్టు వైపు నుంచి ఇంత కన్నా మంచి ఫలితాన్ని తాను ఆశించడం లేదని చెప్పిన హార్దిక్.. గతేడాది అన్నీ తాము అనుకున్నట్లే జరిగాయన్నాడు. అయితే ఈసారి మాత్రం తమకు మిగతా జట్ల నుంచి మంచి ఛాలెంజ్ ఇస్తాయని అనుకుంటున్నామని తెలిపాడు. ఈ విజయాల క్రెడిట్ మొత్తం జట్టుకే దక్కుతుందని కొనియాడాడు.