ఆర్సీబీకి మరోసారి నిరాశే మిగిలింది. ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ (101 నాటౌట్) మంచి స్కోరు అందించాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా మరో పక్క అడ్డుగోడలా నిలిచి ఆర్సీబీకి భారీ స్కోరు అందించాడు.
కానీ గుజరాత్ ఓపెనర్ శుభ్మన్ గిల్ (104 నాటౌట్) కూడా చెలరేగడంతో ఆర్సీబీ ఉంచిన 198 పరుగుల లక్ష్యం చిన్నబోయింది. అతనితోపాటు విజయ్ శంకర్ (54) కూడా రాణించాడు. వీళ్లిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యంతో గుజరాత్ను విజయం వైపు నడిపించారు. అయితే చివర్లో విజయ్, డేవిడ్ మిల్లర్ (0) వెంట వెంటనే అవుట్ అవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది.

కానీ చివరి ఓవర్లో బంతి అందుకన్న వేన్ పార్నెల్ తొలి బంతికే నోబాల్ వేశాడు. ఆ మరుసటి బంతి వైడ్ వేశాడు. తర్వాతి బంతికి గిల్ భారీ సిక్సర్ బాదడంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ విజయం సాధించింది. ఈ ఓటమితో ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. అదే సమయంలో సన్రైజర్స్పై గెలిచిన ముంబై ప్లేఆఫ్స్ చేరింది.
ఈ ఓటమిపై స్పందించిన ఆర్సీబీ సారధి ఫాఫ్ డుప్లెసిస్.. 'ఈ ఓటమి చాలా నిరాశాజనకంగా ఉంది. ఈ రోజు మేం మా బలమైన జట్టుతో బరిలో దిగాం. కానీ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ నుంచి చాలా గ్రిప్ దొరికింది. ఇక్కడ 195-200 చాలా మంచి స్కోరు అని అనుకున్నా. మాకు గిల్ వికెట్ దొరకాల్సింది' అన్నాడు.
'ఇక మా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో టాప్-4 ఆటగాళ్లు రాణించారు. ఈ టోర్నీ మొత్తంలో దాదాపు ప్రతి మ్యాచ్లోనూ మేం కొన్ని పరుగులు మిస్ అవుతూనే ఉన్నాం. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఇలా జరుగుతోంది. ఇక గుజరాత్ ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో మేం అనుకున్న వికెట్లు తీసుకోలేకపోయాం. మాకు మంచి మిడిలార్డర్ కావాలి. అలాగే టీంకు మంచి ఫినిష్ దొరకాలి. లాస్ట్ సీజన్లో డీకే ఆ లోటు తీర్చాడు. కానీ ఈ సీజన్లో అది జరగలేదు' అని వివరించాడు.