ఢిల్లీతో కీలకమైన మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీ చేసిన పని వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మను కోహ్లీ కలిశాడు. స్టేడియంలో అతను నిలబడి ఉండగా తనే ఎదురు వెళ్లి రాజ్కుమార్ కాళ్లకు నమస్కరించాడు. అనంతరం కోహ్లీని కౌగిలించుకున్న రాజ్కుమార్ చాలా సంతోషంగా కనిపించాడు.
తన దగ్గర క్రికెట్ ఓనమాలు దిద్దిన చిన్నపిల్లాడు.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ను ఏలుతుంటే ఏ గురువుకు మాత్రం సంతోషంగా ఉండదు? కోహ్లీనే కాదు.. ఆర్సీబీ యువ ప్లేయర్ అనూజ్ రావత్ కూడా కొంత కాలం రాజ్కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలో అతను కూడా వెళ్లి రాజ్కుమార్ శర్మ కాళ్లకు నమస్కరించాడు. అనంతరం మ్యాచ్లో కోహ్లీ మరో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఈ క్రమంలోనే ఐపీఎల్లో 7 వేల పరుగుల మైలురాయిని కోహ్లీ దాటాడు. ఇది తన దృష్టిలో జట్టు కోసం ఆడుతుంటే చేరుకున్న మరో మైలురాయేనని చెప్పాడు. తన కోచ్ చూస్తుండగా ఈ రికార్డు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. అలాగే తన భార్య, కుమార్తె, అన్నయ్య వాళ్ల కుటుంబం అందరూ ఇక్కడకు వచ్చారని చెప్పాడు. వాళ్లందరి ముందు ఆడటం తనకు కొత్త అనుభూతిని అందించిందన్నాడు.
అలాగే కుర్రాడు మహిపాల్ లోమ్రోర్ అద్భుతంగా ఆడాడని, ఈ పిచ్పై160 పరుగులు చేస్తే మంచి టఫ్ టార్గెట్ అనుకున్నామని, అయితే లోమ్రోర్ ఇన్నింగ్స్తో మరింత మెరుగైన స్కోరు చేశామని చెప్పాడు. అందుకే తాను అతనికి ఎక్కువ స్ట్రైకింగ్ ఇచ్చానని, సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని అనుకున్నానని తెలిపాడు. ఇలా మిగతా వాళ్లు కూడా ఆడటం వల్ల తను, డుప్లెసిస్ వంటి సీనియర్లకు చాలా కాన్ఫిడెన్స్ దొరుకుతుందని అభిప్రాయపడ్డాడు. టోర్నీ కీలక దశలో ఉండగా మిగతా ప్లేయర్లు కూడా ఫామ్ అందుకోవడం జట్టుకు చాలా మేలు చేస్తుందని పేర్కొన్నాడు.