టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్ల నెమ్మదిగా తన ప్రైమ్ ఫామ్ అందుకుంటున్నాడు. ఐపీఎల్లో తను అనుకున్న స్థాయికి చేరుకునే ఛాన్స్ ఉందని చెప్పిన అతను.. ఆ మాట నిలబెట్టుకునే వైపుగా సాగుతున్నాడు. ఆడుతున్న ప్రతి మ్యాచులో మంచి స్కోరు చేసేందుకు ప్రయత్నిస్తూ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ను ముందుండి నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీతో జరిగే మ్యాచులో కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.
ఈ నేపథ్యంలోనే చిన్నస్వామి స్టేడియంలో 2500 పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు కూడా సృష్టించాడు. తను ఎంత పెద్ద స్టార్ ఆటగాడైనా సరే.. ఇంకా మెరుగవ్వాలనే తపన కోహ్లీలో ఉందని ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ చెప్పాడు. ఈ ఆకలే కోహ్లీని మిగతా స్టార్ ఆటగాళ్ల నుంచి వేరు చేస్తుందని, ఇది ఆర్సీబీకి కూడా చాలా మంచిదని అభిప్రాయపడ్డాడు. నిరంతరం తన ఆటను మెరుగు పరుచుకునేందుకు కోహ్లీ కష్టపడతాడని చెప్పాడు.

'తను చేసే ఏ పనిలో అయినా టాప్లో ఉండేందుకు కోహ్లీ ప్రయత్నిస్తాడు. అందుకే నిరంతరం తన ఆటను మెరుగు పరుచుకునేందుకు కష్టపడతాడు. తన స్థాయిని పెంచుకునేందుకు, మరింత మెరుగయ్యేందుకు కష్టపడటం ఒక విధంగా విరాట్ కోహ్లీ హాల్ మార్క్ అని చెప్పొచ్చు. ఈ కారణంగానే టెస్టులు, వన్డే క్రికెట్లో ఎన్నో సవాళ్లను కోహ్లీ అధిగమించగలిగాడు' అని బంగర్ చెప్పుకొచ్చాడు.
'టీ20 క్రికెట్లో తను ఒక విధంగా ఆడాలని అనుకుంటే.. అలా ఆడే సత్తా కూడా తనకు ఉందని కోహ్లీ నిరూపించుకున్నాడు కూడా. అతను ఏ ఫార్మాట్లో అయినా సరే గొప్ప ఆటగాడే. అలాంటి ఆటగాడు తన స్థాయి పెంచుకోవడానికి ప్రయత్నించడం కచ్చితంగా ఆర్సీబీకి చాలా మంచి పరిణామం అని నా నమ్మకం' అని పేర్కొన్నాడు. కోహ్లీ కూడా ఈ సీజన్ ఐపీఎల్లో తన పీక్ ఫామ్ చూపించేందుకు రెడీగా ఉన్నట్లే కనిపిస్తున్నాడు. తను ఆడిన తొలి నాలుగు మ్యాచుల్లో మూడింట్లో హాఫ్ సెంచరీలు చేసి సత్తా చాటాడు.