ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీకి మంచి శుభారంభం దక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (45), కోహ్లీ (55) ఇద్దరూ మంచి ఆరంభం అందించారు. డుప్లెసిస్ మరోసారి భారీ షాట్లతో విరుచుకుపడేలా కనిపించాడు. ఇలాంటి సమయంలో ఆర్సీబీ ఫ్యాన్స్కు మిచెల్ మార్ష్ బీపీ పెంచాడు. అతను వేసిన 11వ ఓవర్లో డుప్లెసిస్ పెవిలియన్ చేరాడు.
అతను అవుటైన తర్వాత మిడిల్ ఓవర్లలో స్కోరింగ్ వేగం పెంచేందుకు గ్లెన్ మ్యాక్స్వెల్ను దించారు. అయితే అతను తను ఎదుర్కొన్న తొలి బంతికే కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇది చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ నోట మాటరాలేదు. మంచి ఫామ్లో ఉన్న మ్యాక్స్వెల్ జట్టుకు మంచి స్కోరు అందిస్తాడని వాళ్లు అనుకున్నారు. కానీ అతను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు.

ఇలా ఒకే ఓవర్లో వరుస బంతుల్లో ఇద్దరు కీలక బ్యాటర్లను అవుట్ చేసిన మార్ష్ కూడా చాలా సంతోషంగా కనిపించాడు. ఢిల్లీ టీం అంతా సంబరాలు చేసుకుంది. ఆ జట్టు ఫ్యాన్స్ కూడా ఈ ఓవర్ను చాలా ఎంజాయ్ చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన మహిపాల్ లోమ్రోర్ మరోసారి తన పవర్ హిట్టింగ్తో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉండటంతో.. కోహ్లీ మరో ఎండ్ నుంచి అతనికి సహకారం అందించాడు.
కానీ హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత లెగ్ సైడ్ సింపుల్ షాట్ ఆడిన కోహ్లీ.. షార్ట్ ఫైన్ లెగ్లో ఖలీల్ అహ్మద్కు చిక్కాడు. అప్పుడే గేర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్న కోహ్లీ ఇలా అవుట్ అవడంతో ఫ్యాన్స్ మరింత నిరాశ చెందారు. కోహ్లీ అవుటవడంతో దినేష్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో కేదార్ జాదవ్ కూడా ఆడుతున్న సంగతి తెలిసిందే.