ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ సారధి డేవిడ్ వార్నర్ తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే తమ జట్టులో కీలక నిర్ణయం తీసుకున్నామని, బిగ్ హిట్టర్ రోవ్మెన్ పావెల్ స్థానంలో మిచెల్ మార్ష్ను జట్టులో ఆడిస్తున్నామని వెల్లడించాడు.
ఆర్సీబీ సారధి డుప్లెసిస్ కూడా టాస్ సమయంలో మాట్లాడుతూ.. తాను టాస్ గెలిచినా ఛేజింగ్ తీసుకునే వాడినని చెప్పాడు. సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ నుంచి మరింత టర్న్ లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. సాధారణంగా చిన్నస్వామి వికెట్ బాగుంటుందన్న ఫాఫ్ డుప్లెసిస్.. 'నేను, విరాట్ ఎంత త్వరగా పిచ్ను అర్థం చేసుకుంటే అంత మంచిది. డెత్ ఓవర్లలో డిఫెండ్ చేసుకోవడం ఇక్కడ చాలా కష్టం' అని వెల్లడించాడు.

ఇక్కడ చివరగా ఆర్సీబీ, లక్నో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారీ స్కోరు చేసినా కూడా ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఇక్కడ తమ బ్యాటింగ్ యూనిట్ మెరుగ్గానే రాణిస్తోందని డుప్లెసిస్ చెప్పాడు. జట్టులో ఆడేందుకు మన బెస్ట్ బ్యాటర్లు, బెస్ట్ బౌలర్లను ఎంచుకోవాలన్నాడు. ఈ క్రమంలోనే డేవిడ్ విల్లే స్థానంలో శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగను ఆడిస్తున్నట్లు తెలియజేశాడు.
టాస్ గెలిచిన వెంటనే తాము ముందుగా బౌలింగ్ చేస్తామని వార్నర్ చెప్పాడు. ఈ గ్రౌండ్ అద్భుతంగా ఉందన్నాడు. ఇక్కడి స్టాఫ్ చక్కగా పని చేస్తున్నారని మెచ్చుకున్నాడు. తాము ఒక్క విజయం సాధిస్తే చాలని, అక్కడి నుంచి మొమెంటం ఫాలో అవుతుందని అభిప్రాయపడ్డాడు. పవర్ప్లేలో వికెట్లు పోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నాడు. తమ జట్టులో ఒకే ఒక్క మార్పు ఉందని చెప్పిన అతను.. పావెల్ స్థానంలో మిచెల్ మార్ష్ ఆడుతున్నట్లు తెలియజేశాడు.