ఢిల్లీతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ఆర్సీబీ మంచి స్కోరు చేసింది. దేశ రాజధానిలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆర్సీబీ సారధి ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచాడు. పిచ్ చాలా డ్రైగా ఉండటంతో తాము ముందుగా బ్యాటింగ్ చేయాలని డుప్లెసిస్ నిర్ణయించుకున్నాడు. తను చిన్నప్పటి నుంచి ఆడుతున్న ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీ (55) అద్భుతంగా ఆడాడు.
ఫాఫ్ డుప్లెసిస్ (45) కూడా సూపర్గా ఆడటంతో ఆర్సీబీకి మంచి ఆరంభం దక్కింది. అయితే డుప్లెసిస్, మ్యాక్స్వెల్ (0) ఇద్దర్నీ ఒకే ఓవర్లో అవుట్ చేసిన మిచెల్ మార్ష్.. ఢిల్లీకి మంచి బ్రేక్ ఇచ్చాడు. ఇలాంటి సమయంలో వచ్చిన యువ బ్యాటర్ మహిపాల్ లోమ్రోర్ (54 నాటౌట్) చెలరేగాడు. ఐపీఎల్లో అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అతని ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పిందని చెప్పొచ్చు.

అంతేకాదు, ఈ సీజన్లో కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ కాకుండా ఆర్సీబీ తరఫున అర్ధశతకం సాధించిన తొలి బ్యాటర్గా లోమ్రోర్ నిలిచాడు. చివర్లో దినేష్ కార్తీక్ (11) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అనూజ్ రావత్ (8 నాటౌట్) తను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదాడు. అయితే చివరి రెండు ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. ముకేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు. పిచ్ను బట్టి చూస్తే ఆర్సీబీ మంచి స్కోరే చేసిందని నిపుణులు అంటున్నారు. ఈ పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభిస్తున్న నేపథ్యంలో ఆర్సీబీ బౌలర్లు ఏ మేరకు రాణిస్తారని చూడాలి.