ఇప్పటి వరకు ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ఢిల్లీ క్యాపిటల్స్ మరో కీలక మ్యాచ్కు రెడీ అవుతోంది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో బెంగళూరు చేరుకున్న ఆ జట్టుకు మంచి సర్ప్రయిజ్ దొరికింది. ఈ జట్టు ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో ఆ టీం మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా స్టేడియానికి వచ్చాడు.
మంచి ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ తదితరులు ప్రాక్టీస్ చేస్తుంటే పంత్ అక్కడే నిలబడి చూశాడు. మధ్య మధ్యలో వారితో నవ్వుతూ మాట్లాడుతూ, జోకులు వేస్తూ సందడిగా సమయం గడిపాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఢిల్లీ క్యాపిటల్స్ తమ సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రాక్టీస్ సెషన్స్లో రికీ పాంటింగ్ కుమారుడు కూడా తన బ్యాటింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్నాడు.

గతేడాది చివర్లో నూతన సంవత్సర వేడుకల కోసం ఇంటికి వెళ్తున్న సమయంలో రిషభ్ పంత్కు ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. పలు శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. నడవడానికి ఇంకా కొంత ఇబ్బందిగా ఉండటంతో చేతికర్రల సాయంతో నడుస్తున్నాడీ స్టార్ క్రికెటర్. ఈ ప్రమాదం కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్లో ఆడటం లేదు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో కూడా పంత్ ఆడటం అనుమానంగానే ఉంది.
ఈ క్రమంలోనే తమ జట్టులో పంత్ చాలా కీలకమైన ఆటగాడని, టీం ఆత్మ వంటి వాడని హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే ఢిల్లీ ఆడిన తొలి మ్యాచ్లో తమ డగౌట్లో రిషభ్ పంత్ జెర్సీని తగిలించి ఆడిందీ టీం. కానీ డేవిడ్ వార్నర్ జిడ్డు బ్యాటింగ్ కారణంగా భారీ స్కోర్లను ఛేజ్ చేయలేక, అలాగే ముందు బ్యాటింగ్ చేసినప్పుడు భారీ స్కోర్లు చేయలేకపోతోంది. మరి ఈ సమస్య నుంచి ఢిల్లీ బయటపడుతుందేమో చూడాలి.