లక్నోతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో ఓటమిపాలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి శుభవార్త. ఈ జట్టు కీలక ప్లేయర్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు వానిందు హసరంగ జట్టుతో చేరాడు. ఇటీవల శ్రీలంక ఆడిన మ్యాచుల్లో ఆడిన హసరంగ.. ఐపీఎల్ ఆడలేదు. ఆ సిరీస్ అయిపోయిన తర్వాత ఐపీఎల్కు వచ్చాడు. హసరంగ లేకపోవడంతో ఇప్పటి వరకు ఆర్సీబీ స్పిన్ బాధ్యతలను కర్ణ్ శర్మ పోషించాడు.
జట్టు తరఫున రాణించిన కర్ణ్ శర్మ.. లక్నోతో మ్యాచ్లో కీలక సమయంలో మార్కస్ స్టొయినిస్ను అవుట్ కూడా చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూర్ చెలరేగడంతో కర్ణ్ శర్మ భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఇప్పుడు వానిందు హసరంగ జట్టుతో చేరడంతో ఆర్సీబీకి బలమైన స్పిన్ ఎటాక్ దొరికినట్లు అయింది. గతేడాది ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ కోసం చాహల్తో గట్టిగా పోటీ పడిన ప్లేయర్ హసరంగ అని తెలిసిందే.

ఇప్పుడు హసరంగ చేరికతో ఆర్సీబీ బౌలింగ్ మరింత బలంగా మారింది. చిన్నస్వామి స్టేడియంలోనే త్వరలో ఢిల్లీతో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్లో హసరంగ ఆడతాడని తెలుస్తోంది. అతను కనుక గాడిలో పడితే ఆర్సీబీ బౌలింగ్ బలం కచ్చితంగా రెట్టింపు అవుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే మరికొన్ని రోజుల్లో ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ కూడా ఆర్సీబీతో కలుస్తాడని తెలుస్తోంది. మడమ గాయంతో ఇబ్బంది పడుతున్న హాజిల్వుడ్.. ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆడలేదు.

ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్కు కూడా దూరమయ్యాడు. మరికొన్ని రోజుల్లో ఆర్సీబీతో కలిసినా కూడా అతను ఆడేందుకు ఇంకా సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని హాజిల్వుడ్ స్వయంగా చెప్పాడు. తాను ఏప్రిల్ 14న ఆర్సీబీ జట్టుతో కలుస్తానని, అయితే ఆ తర్వాత కొంత టైం తీసుకొని ఆడతానని చెప్పాడు. అలాగే ఈ ఆదివారం జరిగే మ్యాచ్లో ఆర్సీబీ తమ గ్రీన్ జెర్సీలో ఆడనుందని తెలుస్తోంది.