చెన్నైతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్లో చెన్నై నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆర్సీబీకి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అవసరం ఉంది. అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ (6) దురదృష్టకం కొద్దీ అవుటయ్యాడు. ఆకాష్ సింగ్ వేసిన మొదటి ఓవర్లో ఒక బౌండరీ బాదిన కోహ్లీ.. ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు.
ఆకాష్ వేసిన బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి అతని కాళ్లకు తగిలింది. కాలికి తగిలిన బంతి వెనక్కు వెళ్లిపోతుందని అనుకున్న కోహ్లీ వెనక్కు తిరిగి చూశాడు. అప్పటికి ఇంకా వెనక్కు వెళ్లలేదా బంతి. కోహ్లీ వెనక్కు తిరిగే క్రమంలో అతని కాలు తగిలి వికెట్లకు తగిలింది. దీంతో కోహ్లీ అవుటయ్యాడు.

ఆ తర్వాత ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఇద్దరూ అదిరిపోయే ఇన్నింగ్సులు ఆడారు. దీంతో ఆర్సీబీ గెలిచేలా కనిపించింది. కానీ చివరకు 8 పరుగుల తేడాతో ఓడింది. కోహ్లీ దురదృష్టం అక్కడితో ఆగలేదు. ఈ మ్యాచ్ సమయంలో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలను కోహ్లీ ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ వేసినట్లు ఐపీఎల్ వెల్లడించింది.
'ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 కింద లెవెల్ 1 నిబంధనను ఉల్లంఘించినట్లు కోహ్లీ అంగీకరించాడు. ఇలా ఈ విషయంలో మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్' అని ఐపీఎల్ నిర్వాహకులు ఒక ప్రకటన చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు కోహ్లీ మ్యాచ్ ఫీజులో 10 శాతాన్ని జరిమానా విధించినట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే కోహ్లీ ఏం చేశాడని కొందరు అభిమానులు అడుగుతున్నారు.
చెన్నై ఆల్రౌండర్ శివమ్ దూబే అవుట్ అయినప్పుడు కోహ్లీ చాలా ఎగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడిన దూబే.. 17వ ఓవర్లో కూడా ఒక భారీ సిక్సర్ బాదేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద సిరాజ్ అందుకున్న సూపర్ క్యాచ్కు పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో కోహ్లీ ఎగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీని గురించే అతనికి ఫైన్ వేసినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు.