చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చాలా థ్రిల్లింగ్గా జరిగింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో ఆర్సీబీ చాలా గట్టిగా పోరాడినా, చివరకు ఓటమినే మూటగట్టుకుంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ అద్భుతంగా ఆడారు. వాళ్లిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు బెంగళూరు ఈజీగా గెలిచేస్తుందని అంతా అనుకున్నారు.
కానీ కీలక సమయంలో వాళ్లు అవుటవడం, తర్వాత వచ్చిన ప్లేయర్లు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆర్సీబీ ఓడిపోయింది. ఇలా ఆర్సీబీ ఓడిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఆ నిర్ణయాలను ఆర్సీబీ ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదు. అవేంటంటే.. బౌలింగ్ వేసేప్పుడు చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే, యువ బ్యాటర్ శివమ్ దూబేలను అవుట్ చేయడానికి ఆర్సీబీ వద్ద ఎలాంటి ప్లాన్ కనిపించలేదు.

ఈ మ్యాచ్లో డెవాన్ కాన్వే 83 పరుగులతో చెలరేగగా.. శివమ్ దూబే కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. వీళ్లిద్దరినీ అవుట్ చేసేందుకు బెంగళూరు వద్ద ఎలాంటి ప్లాన్ లేదు. ఒకరి తర్వాత ఒకరుగా బౌలర్లు వస్తున్నారు, ఓవర్లు వేసి వెళ్తున్నారే కానీ.. వీళ్లను ట్రాప్ చేసేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. ఇది చెన్నై భారీ స్కోరు చేయడానికి బాగా ఉపయోగపడింది. ఆ సమయంలోనే మ్యాచ్ ఆర్సీబీ చెయ్యి జారిందని చెప్పాలి.
ఇక ఛేజింగ్లో బెంగళూరు అదరగొట్టిందనే చెప్పాలి. కానీ కీలక సమయంలో ధోనీ తెలివైన కెప్టెన్సీతో డుప్లెసిస్, మ్యాక్స్వెల్ ఇద్దరూ అవుట్ అయ్యారు. ఆ తర్వాత కాసేపటికే దినేష్ కార్తీక్ కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో కొంచెం భారీ షాట్లు ఆడగలిగే వానిందు హసరంగను బ్యాటింగ్కు పంపాల్సింది. కానీ ఆర్సీబీ అలా చేయలేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా సూయష్ ప్రభుదేశాయిని పంపించింది. అతను తన శక్తిమేర ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోయింది.
ఆ తర్వాత చివర్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన హసరంగ చేయడానికి ఏం మిగల్లేదు. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న సమయంలో అతనికి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశమూ రాలేదు. దీంతో ఆర్సీబీ ఓటమి ఖాయమైంది. అదే కనుక షాబాజ్ అహ్మద్ స్థానంలో హసరంగను పంపి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. ఎందుకంటే హసరంగ నాణ్యమైన ఆల్రౌండర్. ధనాధన్ షాట్లతో చెలరేగే సత్తా ఉన్న ప్లేయర్. కానీ అతన్ని ఉపయోగించుకోవడం ఆర్సీబీకి చేతకాలేదు.