ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు బలంగా ఉన్న జట్టు అంటూ ఆర్సీబీని అందరూ పొగిడారు. కానీ కీలక ఆటగాళ్లకు గాయలు అవడంతో ఆర్సీబీ బలం సగానికి తగ్గిపోయింది. చివర్లో రజత్ పటీదార్ కూడా జట్టుకు దూరం అవడం ఆర్సీబీ బ్యాటింగ్ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ క్రమంలోనే చెన్నైతో జరిగిన బిగ్ స్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నైకి గొప్ప ఆరంభం దక్కలేదు. ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ (3) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే డెవాన్ కాన్వే (83), శివమ్ దూబే (52) చెలరేగారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా ఫర్వాలేదనిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆర్సీబీపై చెన్నై చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం.

లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి కూడా గొప్ప ఆరంభం లభించలేదు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (6) అన్లక్కీగా అవుట్ అయ్యాడు. యువ ప్లేయర్ మహిపాల్ లోమ్రోర్ (0) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ (76) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫాఫ్ డుప్లెసిస్ (56) అండగా అతను రెచ్చిపోయాడు. వీళ్లిద్దరూ క్రీజులో ఉంటే చెన్నైను ఈజీగా ఓడించేలా కనిపించారు.
అయితే ధోనీ తనదైన కెప్టెన్సీతో వీళ్లిద్దర్నీ అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ పరిస్థితికి తగ్గట్లు ఆడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న దినేష్ కార్తీక్ (28) అనవసరంగా భారీ షాట్కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో ఆర్సీబీ చివరకు 8 పరుగుల తేడాతో ఓడింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆ టీంను ట్రోల్ చేస్తున్నారు. గెలిచే మ్యాచ్లో ఓడటం కేవలం ఆర్సీబీకే సాధ్యం అంటూ మీమ్స్ పేలుస్తున్నారు. ఆర్సీబీ లక్కే అంత అంటూ మరికొందరు ఎగతాళి చేస్తున్నారు. మరి వచ్చే మ్యాచ్లో అయినా ఆర్సీబీ అదృష్టం మారుతుందేమో చూడాలి.